ముఖేష్ అంబానీ సహా వేతన కోత, రిలయన్స్ ఆదా చేసేది ఎంతో తెలుసా?
కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వేతనాల్లో కోత విధిస్తున్నాయి. ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తమ ఉద్యోగులకు వేతనాల్లో కోత విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రూ.15 లక్షల కంటే తక్కువ వేతనం ఉన్న వారికి కోత లేదని భారీ ఊరట ప్రకటన చేసింది. రూ.15 లక్షలకు పైన ఉంటే 10 శాతం నుండి 50 శాతం వేతన కోత విధిస్తోంది. ముఖేష్ అంబానీ ఏడాది పాటు వేతనం తీసుకోవద్దని నిర్ణయించారు.
రిలయన్స్ లాభాలకు చమురు దెబ్బ, ఆదుకున్న జియో: రూ.53,125 కోట్ల మెగా రైట్స్ ఇష్యూ
ఏడాదికి రూ.600 కోట్ల ఆదా
ఉద్యోగులందరికీ వేతన కోత లేదు. కేవలం రూ.15 లక్షలకు పైన ఉన్న వారికే కోత ఉంటుంది కాబట్టి మిగతా వారందరికీ అతి పెద్ద ఊరటే అని చెప్పవచ్చు. అయితే ఈ వేతన కోత వల్ల కంపెనీకి మిగిలే మొత్తం కంపెనీ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం చూస్తే అతి తక్కువ. వేతనాల కోత వల్ల ఏడాదికి రూ.600 కోట్ల వరకు ఆదా అవుతుందని అంచనా వేస్తున్నారు.
ఎవరి వేతనంలో ఎంత కోత?
ముఖేష్ అంబానీ తన వార్షిక వేతనం రూ.15 కోట్లను వదులుకుంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి వేతనం తీసుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ బోర్డ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, సీనియర్ల పారితోషికంలో 30 శాతం నుండి 50 శాతం కోత పడుతుంది. రూ.15 లక్షల కంటే ఎక్కువ వేతనం ఉన్న వారికి 10 శాతం కోత విధిస్తున్నారు.
నెలకు రూ.50 కోట్లు...
2019-20 ఆర్థిక సంవత్సరంలో స్టాండలోన్ ఎంప్లాయీస్ బెనిఫిట్ ఖర్చుల కోసం రిలయన్స్ రూ.6,067 కోట్లు (రిఫైనింగ్, పెట్రో కెమికల్స్) ఖర్చు చేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో రూ.1,506 కోట్లు ఖర్చు చేసింది. పది శాతం కోత, తక్కువ మంది ఉద్యోగులకు వేతన కోత ద్వారా రిలయన్స్ ఏడాదిలో చేసే పొదుపు తక్కువే అంటున్నారు నిపుణులు. నెలకు రూ.50 కోట్ల చొప్పున ఏడాదికి రూ.600 కోట్ల వరకు మాత్రమే ఆదా అవుతాయని చెబుతున్నారు.
జియో, రిటైల్ సహా వీరి వేతనం
గురువారం (ఏప్రిల్ 31) నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.3 లక్షల కోట్లు. రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ సహా ఉద్యోగులు సహా ఏకీకృత స్థాయిలో రిలయన్స్ ఉద్యోగుల వేతనం 2019-20లో రూ.14,075 కోట్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది రూ.12,488 కోట్లు. అంటే వేతన కోత వల్ల రిలయన్స్ వంటి దిగ్గజ సంస్థకు ఆదాయ అయ్యే సొమ్ము రూ.600 కోట్లు అంటున్నారు.