రిలయన్స్ రైట్స్ ఇష్యూ అదుర్స్: ముఖేష్ అంబానీ మోములో 'భవిష్యత్తు' ఆనందం!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రైట్స్ ఇష్యూకు విశేష స్పందన వచ్చింది. మే 20వ తేదీన ప్రారంభమైన ఇష్యూ నిన్నటితో (జూన్ 3) ముగిసింది. బుధవారం ముగిసిన ఈ ఇష్యూ 1.59 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. రూ.53,124 కోట్లు సమీకరించాలని కంపెనీ భావించగా వాటాదారుల నుండి ఏకంగా రూ.84,000 కోట్లకు పైగా బిడ్స్ దాఖలయ్యాయి. సంస్థలో ఇప్పటికే వాటాలు ఉన్న వారికి ప్రతి 15 షేర్లకు ఒక కొత్త షేర్ కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది రిలయన్స్. ఇష్యూలో ఒక్కో షేర్ ధరను రూ.1,257గా నిర్ణయించింది. బుధవారం ట్రేడింగ్లో రిలయన్స్ షేర్ వ్యాల్యూ రూ.1,542.45 పలికింది.
10 ఏళ్లలో ప్రపంచంలోనే రిలయన్స్ మెగా రైట్స్ ఇష్యూ అతిపెద్దది!
జూన్ 10వ తేదీ నుండి కేటాయింపు
రైట్స్ ఇష్యూపై చాలామంది ఆసక్తి చూపించారని, లక్షలాదిమంది చిన్న ఇన్వెస్టర్లు, వేలాది ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేసినట్లు తెలిపింది. సంస్థాగత పెట్టుబడిదారులతో పాటు ఫారన్ ఇన్వెస్టర్లు కూడా మొగ్గు చూపారని రిలయన్స్ తెలిపింది. తమ సంస్థ భారతదేశపు అతిపెద్ద రైట్స్ ఇష్యూను రూ.84వేల కోట్లతో ముగించిందని తెలిపింది. ఈ షేర్ల కేటాయింపు జూన్ 10, 2020 నుండి జరుగుతుంది.
అప్పుడు మెర్జ్ చేస్తారు
రిలయన్స్ రైట్స్ ఇష్యూలో భాగంగా కొనుగోలు చేసినవారు విడతలవారీగా చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉంది. చెల్లింపు వాయిదా పద్ధతిలో ఉండటంతో జూన్ 12న లిస్ట్ చేసే సమయానికి పాక్షికవాటాలుగా పేర్కొంటారు. అర్హత కలిగిన షేర్ హోల్డర్స్ మొదటి విడతగా రూ.314.25 సబ్స్క్రిప్షన్ రోజు చెల్లించాలి. రెండో వాయిదాను మే 2021 లోపు చెల్లించాలి. మిగతా మొత్తాన్ని నవంబర్ 2021లోపు చెల్లించాలి. ఈ చెల్లింపులు పూర్తయ్యాక రిలయన్స్ ఇండస్ట్రీస్లోని ఈక్విటీలతో మెర్జ్ చేయబడతాయి.
డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా రైట్స్ ఇష్యూ
రిలయన్స్ రైట్స్ ఇష్యూ అతి పెద్దది అయినప్పటికీ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా పూర్తయింది. తమ రైట్స్ ఇష్యూ దేశంలో, ప్రపంచవ్యాప్తంగా ఓ రికార్డ్ అని రిలయన్స్ తెలిపింది. దేశంలోని 800 నగరాల్లోని స్టేక్ హోల్డర్స్, విదేశాల్లోని వారు కూడా ఇంటి నుండి కాలు బయటపెట్టకుండా రైట్స్ ఇష్యూ ముగిసిందని తెలిపింది. ఇది అభివృద్ధి డిజిటల్ యుగాన్ని తెలియజేయడంతో పాటు భారత్ మార్గనిర్దేశనంగా ఉందని తెలిపింది.
ముఖేష్ మోములో రైట్స్ ఇష్యూ నవ్వు!
రైట్స్ ఇష్యూపై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. షేర్ హోల్డర్స్కు థ్యాంక్స్ చెబుతున్నానని, ఈక్విటీ మార్కెట్లో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. తన తండ్రి ధీరూబాయ్ అంబానీ కాలం నుండి వాటాదారులే తమ బలమని చెప్పారు. రిలయన్స్ భవిష్యత్తుపై వాటాదారులు చూపిన విశ్వాసం మరింత ఆనందాన్ని కలిగించిందన్నారు. భారత వృద్ధిలో తమదైన పాత్ర పోషిస్తామన్నారు. 1.3 బిలియన్ల ఇండియన్స్ జీవితాలను మెరుగుపరిచేందుకు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని చెప్పారు.