అదరగొట్టిన రిలయన్స్, తగ్గిన ఇంధన సేల్స్: రూ.151 నుండి రూ.138కి పడిపోయిన ఆర్పు
ఆసియా కుబేరుడు ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం (జనవరి - మార్చి) త్రైమాసికం ఫలితాలు ప్రకటించింది. రిలయన్స్ నెట్ ప్రాఫిట్ రెండింతలు పెరిగి రూ.13,227 కోట్లకు చేరుకుంది. నెట్ ప్రాఫిట్ ఏకంగా 108.36 శాతం పెరిగింది. అయితే అంచనాలను మాత్రం అందుకోలేదు. కన్సాలిడేటెడ్ నెట్ ప్రాఫిట్ రూ.6348 కోట్లుగా నమోదయింది. అంతకుముందు త్రైమాసికం సెప్టెంబర్-డిసెంబర్లో నెట్ ప్రాఫిట్ రూ.13.101 కోట్లుగా ఉంది.
ఆపరేషన్స్ ద్వారా రిలయన్స్ కన్సాలిడేటెడ్ ఆదాయం రూ.1.54 లక్షల కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ.1.39 లక్షలు కాగా, అంతకుముందు త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్) రూ.1.23 లక్ష ల కోట్లుగా ఉంది.
ఆదాయం, వృద్ధి
చమురు నుండి టెలికం వరకు సేవలు అందిస్తున్న రిలయన్స్ ఆర్థిక ఫలితాలు అదరగొట్టాయి. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13 శాతం ఎగబాకి రూ.1,72,095 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది రిలయన్స్.
కన్జ్యూమర్, రిటైల్, టెలికమ్, పెట్రోకెమికల్ వ్యాపారాలు వృద్ధి బాటపట్టడం కలిసి వచ్చింది. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.5,39,238 కోట్ల ఆదాయంపై రూ.53,739 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఆదాయం 18.3 శాతం తగ్గగా, లాభంలో మాత్రం 35 శాతం వృద్దిని కనబరిచింది.
తగ్గిన ఇంధన సేల్స్
కరోనా ప్రభావం కంపెనీ నాలుగో త్రైమాసికంపై పడింది. దీంతో కంపెనీ రిఫైనింగ్ మార్జిన్స్ క్షీణించాయి. ఇంధన సేల్స్ తగ్గాయి. అయితే రిటైల్, టెలికం వ్యాపారాలు ఆదుకున్నాయి. దీంతో లాభాలు పెంచుకుంది. గత ఏడాది మార్చిలో రిలయన్స్ మొత్తం ఆదాయంలో 35 శాతమున్న రిటైల్, టెలికాం రంగాల వాటా 2021 మార్చి నాటికి 45 శాతానికి పెరిగింది. 2021 మార్చి త్రైమాసికంలో 75,000 కొత్త ఉద్యోగాలు వచ్చాయి.
జియో అదుర్స్
మార్చితో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ సత్తా చాటింది. మార్చి త్రైమాసికంలో కంపెనీ రూ.18,278 కోట్ల ఆదాయంపై రూ.3,508 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఆదాయం 19 శాతం పెరిగింది. నికర లాభం మాత్రం 47.5 శాతం పెరగడం గమనార్హం. 2020-21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి చూసినా జియో రూ.73,503 కోట్ల ఆదాయంపైరూ.32,359 కోట్ల స్థూల లాభం, రూ.12,537 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది.
వినియోగదారుడి నుండి లభించే సగటు ఆదాయం (ARPU) డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే రూ.151 నుండి రూ.138.2కు పడిపోయింది. అయినా నికర లాభం 47.5 శాతం పెరిగింది. జియో ఖాతాదారుల సంఖ్య 42.6 కోట్లకు చేరుకుంది. ఏడాది కాలంలో 1.54 కోట్లు పెరిగింది.