రిలయన్స్ ఆదాయం రికార్డ్, 2 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలు
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అదరగొట్టింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో బలమైన ఫలితాలు ప్రకటించింది. అన్ని రంగాల్లోని వ్యాపారాలలో ఆదాయం, లాభాలు పెరిగాయి. రిటైల్ ప్రాఫిట్ మాత్రమే 5 శాతం క్షీణించింది. జనవరిలో కరోనా కారణంగా రిటైల్ లాభం తగ్గింది. రిటైల్ వ్యాపారంలో 15,000 స్టోర్స్ మార్కును అధిగమించింది. జియో ఫైబర్ రెండేళ్లలోనే అతిపెద్ద బ్రాడ్ బ్యాండ్గా నిలిచింది. దేశీయ గ్యాస్ రంగంలో రిలయన్స్ సహజవాయువు వాటా 20 శాతానికి చేరుకున్నది. మొత్తానికి రిలయన్స్ వార్షిక ఆదాయం 100 బిలియన్ డాలర్లు లేదా రూ.7.7 లక్షల కోట్లు దాటింది.
100 బిలియన్ డాలర్లు క్రాస్
ఓ కంపెనీ ఆదాయం రూ.7.7 లక్షల కోట్లు దాటడం భారత్లో ఇదే ప్రథమం. ఈ రికార్డ్ సాధించిన ఏకైక దేశీయ కంపెనీగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో రిలయన్స్ ఏకీకృత నికర లాభం రూ.16,203 కోట్లకు చేరుకుంది. 2020-21 ఇదే త్రైమాసికంలో రూ.13,227 కోట్ల కంటే ఇది 22.5 శాతం ఎక్కువ. కంపెనీ ఆదాయాలు 35 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లకు చేరాయి. చమురు రిఫైనింగ్ మార్జిన్లు భారీగా నమోదవడం, టెలికం, డిజిటల్ సేవల రంగాల్లో స్థిర వృద్ధి లభించడం, రిటైల్ వ్యాపారం బలమైన పనితీరును కనబరచడంతో సాధ్యమైంది. అయితే అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంతో పోలిస్తే 12.6 శాతం తగ్గింది. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నికర లాభం రూ.60,705 కోట్లు, ఆదాయం రూ.7.92 లక్షల కోట్లకు చేరుకుంది. అన్ని విభాగాల్లో కలిపి 2.1 లక్షల మందికు పైగా కొత్త ఉద్యోగులను నియమించింది.
జియో ఆదాయం అదుర్స్
మార్చి త్రైమాసికంలో రిలయన్స్ జియో నికర లాభం 24 శాతం పెరిగి రూ.4313 కోట్లకు చేరుకుంది. స్థూల ఆదాయం 21 శాతం పెరిగి రూ.26,139 కోట్లుగా నమోదయింది. గత రెండు త్రైమాసికాల్లో వినియోగదారులు తగ్గినప్పటికీ వినియోగదారు సగటు 21.3 శాతం వృద్ధితో రూ.167.6కు చేరుకుంది. పూర్తి ఏడాదికి రూ.95,804 కోట్ల ఆదాయంపై రూ.15,487 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
రిలయన్స్ రిటైల్
రిలయన్స్ రిటైల్ వ్యాపార నికర లాభం మార్చి త్రైమాసికంలో దాదాపు 5 శాతం క్షీణించింది. గత త్రైమాసికంలో 793 కొత్త స్టోర్స్ తెరవడంతో ఈ స్టోర్స్ సంఖ్య 15,196కు పెరిగింది. వివిధ బ్రాండ్స్ కొనుగోలుకు, స్టోర్స్ ఏర్పాటుకు 1 బిలియన్ డాలర్లు ఖర్చయింది.