న్యూస్ మీడియాను విక్రయించడం లేదు: ముఖేష్ అంబానీ రిలయన్స్
మీడియా వ్యాపారాన్ని తాము టైమ్స్ గ్రూప్కు విక్రయిస్తున్నామని వచ్చిన వార్తల్ని ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గురువారం కొట్టి పారేసింది. అవి తప్పుడు వార్తలని, ఆధారాలు లేకుండా చెబుతున్నారని పేర్కొంది. తనకు చెందిన నెట్ వర్క్ 18ను టైమ్స్ గ్రూప్కు విక్రయించేందుకు ముఖేష్ అంబానీ సంప్రదింపులు జరిపినట్లుగా వార్తలు వచ్చాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా పబ్లిషర్ బెన్నెట్ కొలేమాన్ అండ్ కో కు చెందిన ప్రతినిధి ఇచ్చిన సమాచారం ఆధారంగా బ్లూమ్ బర్గ్లో కథనం వచ్చింది. నష్టాలు వస్తున్న వ్యాపార విభాగాలను తొలగించుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రయత్నిస్తున్నట్లుగా అభిప్రాయపడింది. దీనిపై బెన్నెట్ కోలేమాన్ ప్రతినిధి స్పందించాల్సి ఉంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ వార్తను గట్టిగా ఖండిస్తోందని, ఆధారాలు లేకుండా తప్పడు వార్తను ప్రచురించాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రతినిధి తెలిపారు.
జియో ఎఫెక్ట్: ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఘనత
కాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ 2014లో నెట్ వర్క్ 18ను కొనుగోలు చేసింది. రూ.4000 కోట్లకు దీనిని కొనుగోలు చేసింది. ఈ సంస్థకు 56 ప్రాంతీయ ఛానల్స్ ఉన్నాయి. నెట్ వర్క్ 18 యాజమాన్యంలో సీఎన్బీసీటీవీ 18, సీఎన్ఎన్-ఐబీఎన్, సీఎన్ఎన్ అవాజ్, వెబ్ సైట్లు ఫస్ట్ పోస్ట్ డాట్ కామ్, మనీ కంట్రోల్ డాట్ కామ్, మేగజైన్లు ఫోర్బ్స్ ఇండియా లైసెన్స్, వినోదాత్మక ఛానల్స్ కలర్స్, ఎంటీవీ వంటివి ఉన్నాయి. ఇందులో సాధారణ వార్తలను న్యూస్ 18, వ్యాపార వార్తలను సీఎన్బీసీటీవీ 18 ప్రసారం చేస్తోంది.
బీఎస్ఈలో నమోదైన టీవీ 18 బ్రాడ్ కాస్ట్ కింద వార్తా ఛానల్స్ ఉన్నాయి. వీటి మార్కెట్ వ్యాల్యూ రూ.4100 కోట్లు కాగా, ప్రమోటర్లకు 60.40 శాతంగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.1.03 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. 2018-19లో రూ.8.5 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.