కరోనా సమయంలో రికార్డ్ FDI, దేశం కోసం టాటా గ్రూప్ ఎంతో చేసింది: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సమయంలో భారత్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని ప్రధాని నరేంద్రమోడీ అసోచామ్ ఫౌండేషన్ 2020 ఈవెంట్లో తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ప్రజలు కూడా అండగా ఉండాలన్నారు. భారత ఆర్థిక వ్యవస్థపై యావత్ ప్రపంచం గట్టి విశ్వాసంతో ఉందని, అందుకే కరోనా కాలంలో పలుదేశాలు పెట్టుబడులపై కలత చెందగా, భారత్కు మాత్రం భారీగా వచ్చాయన్నారు. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ రికార్డ్స్థాయిలో వచ్చాయన్నారు. డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరిగాయన్నారు.
పెట్టుబడులు ఆకర్షించేందుకు..
పెట్టుబడుల తీరులో వచ్చిన మార్పులకు అనుగుణంగా 1,500 కాలం చెల్లిన, పాత చట్టాల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టామని, పెట్టుబడులను ఆకర్షించే విషయంలో ప్రభుత్వం ఇదే వైఖరిని కొనసాగిస్తుందని మోడీ అన్నారు. ప్రస్తుతం భారత్ స్వావలంబన దిశగా పయనిస్తోందని, స్వయం సమృద్ధి కోసం ఇండస్ట్రీ అన్ని విధాలా కృషి చేయాలన్నారు. భారత వృద్ధిపై ప్రపంచం సానుకూలంగా ఉందన్నారు. వ్యాక్సిన్ సరఫరాలో కూడా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు. పరిశ్రమ అత్యుత్తమ కార్పొరేట్ పాలన, లాభాల పంపిణీ విధానాలను అనుసరించాలన్నారు.
పరిశ్రమకు సానుకూల వాతావరణం
పరిశ్రమ కోసం ప్రభుత్వం అవసరమైన వసతులు, సానుకూల వాతావరణం ఏర్పాటు చేయడమే కాకుండా ప్రోత్సాహకాలు అందిస్తుందన్నారు. అయితే ప్రభుత్వం మద్దతు విజయం మారాలంటే ఇండస్ట్రీ పైనే ఉందన్నారు.
సమర్థవంతమైన, స్నేహపూర్వక వ్యవస్థ ఏర్పాటుకు ప్రభుత్వ ప్రయత్నాలు కొనసాగుతాయన్నారు. గతంలో భారత్లో పెట్టుబడులు ఎందుకు అనే స్థాయి నుండి ఇప్పుడు భారత్లో పెట్టుబడులు ఎందుకు పెట్టవద్దు అనే పరిస్థితికి వచ్చిందన్నారు.
టాటా, అసోచామ్ సేవలు ఎంతో
గత 100 సంవత్సరాలుగా అసోచామ్, టాటా గ్రూప్ భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ఎంతగానే శ్రమిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. భారత అభివృద్ధిలో టాటా గ్రూప్ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. అసోచామ్ ఎంటర్ప్రైజ్ ఆఫ్ ది సెంచరీ అవార్డును ఈ సందర్భంగా టాటా చైర్మన్ రతన్ టాటాకు అందించారు. రతన్ టాటా మాట్లాడుతూ.. కరోనా కారణంగా ఏర్పడినసమయంలో దేశాన్ని ముందుకు నడిపిన మోడీకి థ్యాంక్స్ అని, లాక్ డౌన్ సమయంలో ఎదురైన వ్యతిరేకతను, ఆటుపోట్లను తట్టుకొని దేశాన్ని ఏకతాటిపై ముందుకు నడిపించారన్నారు.