2022లో సరికొత్తగా రియాల్టీ రంగం, అందుకే ధరలు 30% వరకు పెరగవచ్చు
2022 క్యాలెండర్ ఏడాదిలో రియాల్టీ ధరలు 30 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని రియాల్టీ డెవలపర్స్ అంచనా వేస్తున్నారు. బిల్డింగ్ మెటీరియల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ ధరలు కూడా పెరగవచ్చుని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(CREDAI) తెలిపింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సెంటిమెంట్ సర్వే 2022 పేరుతో నివేదికను విడుదల చేసింది. ఈ సర్వేలో 1322 మంది డెవలపర్స్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎక్కువమంది డెవలపర్స్ ధరలు పెరుగుతాయని తెలిపారు.
ఎంత శాతం మంది ఏం చెప్పారంటే
సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం మంది డెవలపర్స్ 2022లో ధరలు 20 శాతం వరకు పెరగవచ్చునని తెలిపారు. బిల్డింగ్ మెటిరీయల్ ధరలు పెరిగిన కారణంగా ఈ పెంపు ఉండవచ్చునని చెప్పారు. 35 శాతం మంది డెవలపర్స్ 10 శాతం నుండి 20 శాతం మేర పెరగవచ్చునని, 25 శాతం మంది బిల్డర్లు 10 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మరో 21 శాతం మంది 20 శాతం నుండి 30 శాతం పెరగవచ్చునని వెల్లడించారు.
కరోనా.. డిజిటలైజేషన్
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ఆందోళనలు కొనసాగుతున్నాయి. కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందని, థర్డ్ వేవ్ వ్యాప్తిని నిలువరించేందుకు కూడా అలాగే చేస్తోందని, అదే సమయంలో వివిధ రంగాలకు ఊతమిచ్చేందుకు అనేక చర్యలు ప్రకటించవచ్చునని క్రెడాయ్ నేషనల్ ప్రెసిడెండెట్ హర్ష్ వర్ధన్ పటోడియా అన్నారు. చాలామంది డెవలపర్స్ డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ పైన దృష్టి సారించారని, ఆన్ లైన్ సేల్స్ను పెంచుకుంటున్నారని తెలిపారు. దాదాపు 39 శాతం మంది డెవలపర్స్ తమ వ్యాపారంలో 25 శాతాన్ని ఆన్ లైన్ ద్వారా కొనసాగిస్తున్నారని తెలిపారు.
2022లో కొత్తగా..
2022లో 74 శాతం మంది డెవలపర్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, 55 శాతం మంది డెవలపర్లు వర్చువల్ రియాల్టీని అడాప్ట్ చేసుకుంటున్నారు. అలాగే 39 శాతం మంది డెవలపర్స్కు చెందిన 25 శాతం వ్యాపారం ఆన్లైన్ ద్వారా కొనసాగుతోంది. 65 శాతం మంది డెవలపర్లు 2022లో కొత్త మోడల్ వ్యాపారానికి సిద్ధమవుతున్నారు. కో-వర్కింగ్, కో-లివింగ్ వంటి వాటికి మొగ్గు చూపుతున్నారు.
ఇదిలా ఉండగా, రియాల్టీ రంగం నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పైన కూడా ఎన్నో ఆశలు పెట్టుకుంది.