China Housing Bubble: ప్రమాదం అంచున చైనా ఆర్థిక వ్యవస్థ.. పేలుతున్న హౌసింగ్ బబుల్.. భారత్ పై ప్రభావం ఇలా..
China Realty Bubble: కరోనా తరువాత చైనా ప్రపంచంపై మరో ఆర్థిక బాంబు పేల్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ సారి ఆ దేశ రియల్ ఎస్టేట్ ఇందుకు కారణం కాబోతోంది. 2008లో అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా ఇదే కారణం వల్ల ఆర్థిక మాంద్యానికి కారణమైంది. ఇప్పుడు ప్రపంచంలో రెండవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన డ్రాగన్ కూడా అదే మార్గంలో నడుస్తోంది. ఇది భారతదేశంపై కూడా పెను ప్రభావాన్ని చూపబోతుందని విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు సాక్ష్యం చైనాకు చెందిన ప్రాపర్టీ దిగ్గజం ఎవర్గ్రాండే తన అప్పులను చెల్లించలేక డీఫాల్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సంస్థ అప్పుల విలువ దాదాపు 300 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వడ్డీ చెల్లింపులు చేయడంలో కంపెనీ విఫలమైంది.
హౌసింగ్ లోన్స్ చెల్లించమంటున్న చైనీయులు..
ఈ నెల ప్రారంభంలో చైనా ప్రజలకు రియల్ ఎస్ట్రేట్ కంపెనీలు పుచ్చకాయలు, ఇతర ఆహార ఉత్పత్తులకు ఇళ్లను అమ్ముతున్న పరిస్తితిని మనం గమనించాం. కానీ ఇప్పుడు.. 22 నగరాల్లోని గృహ కొనుగోలుదారులు అసంపూర్తిగా ఉన్న ఇళ్లపై తనఖా చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తున్నారు. పరిస్థితులు క్రమంగా పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టుగా మారుతున్నాయి. దీని వల్ల బ్యాంకులకు డిఫాల్టులు పెరుదుకున్నాయి. గణాంకాల ప్రకారం చైనాలో 6 ట్రిలియన్ డాలర్ల లోన్స్ ప్రమాదంలో పడతాయని ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్షుడు జి జిన్పింగ్ నిర్ణయాలు కూడా దీనికి కారణమని తెలుస్తోంది.
చైనా పరిపాలనా వైఫల్యాలు.. ప్రజలపై భారం..
చైనా జీడీపీకి ఎక్కువ కాంట్రిబ్యాట్ చేస్తున్న రియల్ ఎస్ట్రేట్ రంగం కుదేలుతో చైనా ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు ప్రారంభమయ్యాయి. రియల్టీ రంగానిరి ఫైనాన్సింగ్ పరిమితం చేయటం, మార్టగేజ్ లోన్ల చెల్లింపుల వైఫల్యాలను కట్టడి చేయటంలో బీజింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బబుల్ పగులుతోంది. రియల్టీ కంపెనీలు లోన్స్ చెల్లింలేని ప్రస్తుత పరిస్థితిలో ఇళ్లు కొనేందుకు అడ్వాన్సులు చెల్లించిన వారిపై గృహరుణాల చెల్లింపు భారం పడుతోంది. ఇది భారీ ఆర్థిక, సామాజిక నష్టాలకు కారణమవుతుందంటూ.. 20 లక్షలకు పైగా కొనుగోలుదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
భారీగా నిలిచిపోయిన నిర్మాణాలు..
వివరాల ప్రకారం 2021లో చైనా వ్యాప్తంగా 24 ప్రధాన నగరాల్లో విక్రయించబడిన 10% గృహాల నిర్మాణాలు నిలిచిపోయాయి. వీటి విలువ 250 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని చైనా మర్చంట్స్ సెక్యూరిటీస్ వెల్లడించింది. బీజింగ్ తనఖా చెల్లింపులను ఆలస్యం చేయడానికి గృహ కొనుగోలుదారులను అనుమతించడం లేదా ప్రాజెక్ట్లను కొనుగోలు చేయడానికి స్థానిక ప్రభుత్వాలను అనుమతించడం ద్వారా పరిస్థితి తీవ్రతరం కాకుండా నిరోధించడానికి వేగంగా స్పందించాల్సి ఉంటుంది.
ప్రజల నిరసనలు..
డెవలపర్లు నిర్మాణ షెడ్యూళ్లను పాటించడంలో విఫలమైనందుకు నిరసనగా చైనాలోని డజన్ల కొద్దీ అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులలోని హౌసింగ్ యూనిట్ల కొనుగోలుదారులు తనఖా చెల్లింపులు చేయడానికి నిరాకరిస్తున్నారని చైనా మీడియా కైక్సిన్ జూలై 14న నివేదించింది. దీనిని చైనా సరైన రీతిలో నియంత్రించకపోతే ప్రపంచ దేశాలు ఆర్థికంగా ప్రభావితమై భారీ మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా మాంద్యంలోకి జారుకుంటే భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఎగుమతులు, దిగుమతులు ప్రభావితమవుతాయి.