లక్ష్మీ విలాస్ విలీనానికి ICICI, కొటక్ మహీంద్రా బెట్టర్: శ్రీవేంకటేశ్వరుడే తొలి భాగస్వామి..
లక్ష్మీ విలాస్ బ్యాంక్(LVB)ని కొనుగోలు చేసేందుకు వివిధ సంస్థలు ముందుకు వస్తున్నాయి. క్లిక్స్ క్యాపిటల్స్ దీనిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డిబెంచర్స్ జారీ ద్వారా రూ.2,500 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఎన్సీడీల జారీ ద్వారా ఈ మొత్తాలను సమీకరించేందుకుగాను గత నెల 30వ తేదీన జరిగిన సమావేశంలో వాటాదారుల అనుమతులు కోరింది. క్లిక్స్తో పాటు ప్రయివేటురంగ బ్యాంకులు ఐసీఐసీఐ, కొటక్ మహీంద్ర బ్యాంకులు కూడా విలీనానికి ఆసక్తిగా ఉన్నాయని తెలుస్తోంది.
లక్ష్మీ విలాస్, ధనలక్ష్మీ... సంక్షోభంలో బ్యాంకులు
ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రల వైపు మొగ్గు
క్లిక్స్ గ్రూప్తో లక్ష్మీ విలాస్ బ్యాంకు విలీన ప్రతిపాదన ఒకవేళ కార్యరూపం దాల్చకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ మహీంద్రా బ్యాంకులను బెయిలవుట్ ప్యాకేజీ ప్రకటించమని కోరే అవకాశాలు ఉన్నాయని బ్యాంకింగ్ నిపుణులు భావిస్తున్నారు. ఈ రెండు బ్యాంకులు విలీనానికి ఉత్తమం అని భావిస్తున్నారు. ఐసీఐసీఐ బ్యాంకుకు విలీనం లేదా కొనుగోళ్లలో మంచి అనుభవం ఉంది. 2000లో బ్యాంక్ ఆఫ్ మధుర, 2007లో సంగ్లి బ్యాంకు, 2013లో బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ను కొనుగోలు చేసింది. ఇక, కొటక్ మహీంద్ర బ్యాంకు 2015లో ఐఎన్జీ వైశ్య బ్యాంకును కొనుగోలు చేసింది. అందుకే ఆర్బీఐ కూడా లక్ష్మీ విలాస్ బ్యాంకు విషయంలో ఈ రెండు బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చునని భావిస్తున్నారు.
క్లిక్స్ గ్రూప్తో నాటి నుండి చర్చలు
మేనేజింగ్ డైరెక్టర్గా సుందర్, సీఈవోతో పాటు ఏడుగురు డైరెక్టర్లను బోర్డులో నియమించడాన్ని లక్ష్మీ విలాస్ బ్యాంకు వాటాదారులు గత నెలలో తిరస్కరించిన విషయం తెలిసిందే. వారిని బోర్డులోకి తీసుకోవడానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు బ్యాంకు రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. బ్యాంకు మూలధనం కోసం ప్రయత్నాలు చేస్తున్న సమయంలో, విలీనం కోసం క్లిక్స్ గ్రూప్తో చర్చలు జరుపుతున్న సమయంలో ఈ సంక్షోభం తెరపైకి వచ్చింది. కరోనా కారణంగా క్లిక్స్ గ్రూప్తో ఒప్పందం ఆలస్యం కావొచ్చునని జూలై 30న లక్ష్మీ వికాస్ బ్యాంకు తెలిపింది. 2020 సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించేందుకు ఇరుపార్టీలు అంగీకరించాయి. అంతలోనే సంక్షోభంలో కూరుకుపోయింది.
ఇబ్బందులు ఇలా...
ఎంఎస్ఈల నుండి పెద్ద వ్యాపారాలకు రుణాలు ఇవ్వడంపై దృష్టి సారించడంతో లక్ష్మీ విలాస్ బ్యాంకుకు కష్టాలు మొదలయ్యాయనే వాదనలు ఉన్నాయి. మూడేళ్ల క్రితం బ్యాంకులో చేసిన రూ.794 కోట్ల డిపాజిట్లపై రాన్బాక్సీ, ఫోర్టిస్ హెల్త్ కేర్ మాజీ ప్రమోటర్లు మల్వీందర్ సింగ్, శివీందర్ సింగ్లకు చెందిన పెట్టుబడి సంస్థలకు దాదాపు రూ.720 కోట్ల రుణాలు ఇవ్వడం బ్యాంకుకు ఇబ్బందికరంగా మారాయి. నిరర్థక ఆస్తులు భారీగా పెరగడంతో 2019 సెప్టెంబర్లో ఆర్బీఐ సత్వర దిద్దుబాటు చర్యల్లోకి వచ్చింది. 2019 మే నెలలో మూలధన అవసరాలకు ఇతర సంస్థలతో క్రెడిట్లతో కూడిన విలీన ప్రతిపాదనను ఆర్బీఐ తిరస్కరించింది. జూన్ 15న క్లిక్స్ క్యాపిటల్ సర్వీసెస్, క్లిక్స్ ఫైనాన్స్ ఇండియాలతో విలీనానికి ఒప్పందం కుదుర్చుకుంది.
వెంకటేశ్వరుడే తొలి షేర్ హోల్డర్
కాగా, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరస్వామి తమ తొలి షేర్ హోల్డర్ అని, తమ బ్యాంకును ఆయనే కాపాడుతారని లక్ష్మీ విలాస్ బ్యాంకు ప్రమోటర్లలో ఒకరైన ప్రదీప్ ఇటీవల అన్నారు. షేర్ హోల్డర్ నెంబర్ 1 స్థానం తమిళనాడు కరూరు సమీపంలోని థంథోనిమలైలోని ప్రముఖ దేవాలయంలో వెలిసిన అరుల్మిగు శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి పేరు మీద ఉంది. ఆయన మా బ్యాంకును సదా ఆపద రాకుండా కాపాడుతారన్నారు. 1926లో విదేశీ బ్యాంకులకు ప్రత్యామ్నాయంగా లక్ష్మీ విలాస్ బ్యాంకును స్థాపించినట్లు తెలిపారు. దేశంలో ఇప్పుడు 556 శాఖలతో ఉంది. విదేశాల్లోను కార్యకలాపాలు నిర్వహిస్తోంది.