డాలర్ మారకంతో రూపాయి భారీ పతనం, రంగంలోకి RBI
అమెరికా డాలర్ మారకంతో రూపాయి భారీగా పతనమవుతోంది. క్రితం సెషన్లో ఆల్ టైమ్ కనిష్టం 79.37ను తాకింది. 80 సమీపానికి పతనమైంది. డాలర్ మారకంతో రూపాయి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 4.1 శాతం మేర క్షీణించింది. అలాగే ఫారెక్స్ రిజర్వ్స్ 40 బిలియన్ డాలర్లకు పైగా తగ్గాయి. గత తొమ్మిది నెలల్లో ఇదే గరిష్టం. రూపాయి రోజురోజుకు క్షీణిస్తున్న నేపథ్యంలో కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) రంగంలోకి దిగింది. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు చర్యలు ప్రకటించింది.
FPIలు ప్రస్తుతం ఐదు, పది, ముప్పై ఏళ్ల కాలపరిమితి ఉన్న ప్రభుత్వ రుణ పత్రాల్లో మాత్రమే పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. ఏడు, పద్నాలుగు సంవత్సరాల కాలపరిమితి ఉండే రుణ పత్రాలకు దీనిని విస్తరించాలని ఆర్బీఐ నిర్ణయించింది. అలాగే స్వల్పకాలిక ప్రభుత్వ, కార్పోరేట్ రుణ పత్రాల్లో FPIల పెట్టుబడులపై ప్రస్తుతం 30 శాతం పరిమితిని అక్టోబర్ వరకు ఎత్తివేసింది.
మన బ్యాంకుల్లో FCNR(), NRE పేర్లతో ఎన్నారైలకు ఉండే డిపాజిట్ వడ్డీ రేటుపై బ్యాంకులకు స్వేచ్చను ఇచ్చింది. ప్రస్తుతం బ్యాంకులు ఈ డిపాజిట్లపై లిబర్ వంటి ప్రామాణిక అంతర్జాతీయ వడ్డీ రేట్ల కంటే 2.5 శాతం నుండి మూడు శాతానికి మించి వడ్డీ రేటును చెల్లించవద్దు. ఈ వడ్డీ రేటు పైన బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది. దీనికి తోడు ఈ డిపాజిట్లను సీఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ పరిమితుల నుండి మినహాయించాలని నిర్ణయించింది.
కంపెనీలు విదేశీ వాణిజ్య రుణాల ద్వారా 75 కోట్ల డాలర్లకు మించి సమీకరించకూడదు. ఈ పరిమితిని 150 కోట్ల డాలర్లకు పెంచాలని ఆర్బీఐ నిర్ణయించింది. మంచి రేటింగ్ కలిగిన కంపెనీలకు ఇది మేలు చేస్తుంది. దేశీ, విదేశీ బ్యాంకులు విదేశీ కరెన్సీ రూపంలో ఇచ్చే రుణాల పరిమితిని ఆర్బీఐ పెంచింది.