ఈసారి సమయానికి శాలరీ పడితే.. ఈ వ్యాపారంలో దూకుడు, వేలాది కొత్త ఉద్యోగాలు
కరోనా మహమ్మారి కారణంగా వివిధరంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోయాయి.. పోతున్నాయి. అయితే కరోనా తర్వాత కొన్ని రంగాలు భారీగా పుంజుకుంటాయనే వాదనలు కూడా ఉన్నాయి. ఇలా పుంజుకుంటాయని భావిస్తున్న రంగాల్లో ఇన్సురెన్స్ రంగం ఉంది. కరోనా - లాక్ డౌన్ కారణంగా ఉద్యోగాలు లేక నిరుద్యోగులు పెరుగుతున్న సమయంలో ఇన్సురెన్స్ కంపెనీలు స్వల్పంగా ఊరట కల్పించే ప్రకటన చేశాయి.
మోడీ ప్యాకేజీ బాగాలేదు.. జన్ ధన్ అకౌంట్లో వేసినట్లు నగదు ఇవ్వాల్సింది
బిజినెస్ ఊపందుకుంటుందని
త్వరలో ఇన్సురెన్స్ విభాగంలో 5,000కు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు తెలిపాయి. అయితే నైపుణ్యం ఉన్న అభ్యర్థులకే ఎక్కువ అవకాసాలు ఉంటాయని కంపెనీలకు చెందిన ప్రతినిధులు చెబుతున్నారు. లాక్ డౌన్ అనంతరం ఇన్సురెన్స్ వ్యాపారం ఊపందుకుంటుందనే అంచనాల నేపథ్యంలో అటు లైఫ్, ఇటు జనరల్ బీమా సంస్థలు నియామకాలు చేపడుతున్నట్లు తెలిపాయి.
ఈ సంస్థల్లో వేలల్లో ఉద్యోగాలు
ఈ క్వార్టర్లో దాదాపు 1,500 మందిని నియమించుకోవాలని పీఎన్బీ మెట్ లైఫ్ సిద్ధమవుతోంది. ఏడాది చివరకు ఈ నియామకాలను మూడువేలకు పెంచుకోవాలని భావిస్తోంది. కెనరా హెచ్ఎస్బీసీ ఓబీసీ లైఫ్ కంపెనీలు ఒక్కొక్కటి వెయ్యి మంది చొప్పున నియమించుకునే యత్నాల్లో ఉన్నాయి. టాటా ఏఐజీ కొత్తగా వెయ్యిమందిని, టాటా ఏఐఏ లైఫ్ కొత్తగా 500 మందిని నియమించుకోనున్నాయి. ఇప్పటికే 300 నియామకాలు చేపట్టింది రిలయన్స్ నిప్పన్ లైఫ్. మరో 400 మందిని రిక్రూట్ చేసుకోనుంది.
ఈసారి చేతిలో సరైన సమయానికి చేతిలో శాలరీ పడితే...
కరోనా సంక్షోభం తర్వాత బీమా తీసుకునేవాళ్లు పెరుగుతారని కంపెనీలు భావించి తదనుగుణంగా నియామకాలు చేపడుతున్నాయని టీమ్ లీజ్ రిక్రూటింగ్ సంస్థ చీఫ్ అజయ్షా అన్నారు. అలాగే ఈరంగంలో చోటు చేసుకున్న కొత్త కలయికలు, విలీనాలతో ఉద్యోగాలు పెరగనున్నట్లు చెప్పారు. లాక్ డౌన్ అనంతరం తిరిగి ఎకానమీలో వ్యాపార కార్యకలాపాలు ఆరంభమై, వేతనజీవులకు సమయానికి జీతాలు వచ్చే పరిస్థితులు నెలకొంటే ముందుగా బీమా వైపు చూస్తారని ఎక్కువమంది బీమా నిపుణులు చెబుతున్నారు. ప్రజలకు తమ ఆరోగ్యాలు, తమవారి జీవితాలపై శ్రద్ధ పెరగడం బీమా రంగానికి మరింత ఊతమిస్తుందంటున్నారు.
6 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు
ఇన్సురెన్స్ ఇండస్ట్రీలో ప్రస్తుతం 6 లక్షల డైరెక్ట్ ఉద్యోగాలు ఉన్నాయి. పరోక్ష, కాంట్రాక్ట్ మ్యాన్పవర్ను కలిపితే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. 2017-18 ఆర్థిక సంవత్సరం చివరి వాటికి కేవలం 35 శాతం మంది మాత్రమే ఇన్సురెన్స్ కలిగి ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రానున్న రోజుల్లో చాలామంది ఇన్సురెన్స్ వైపు మొగ్గు చూపుతారని భావిస్తున్నారు. మొదటి వారంలో లాక్ డౌన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. సేల్స్ భారీగా పడిపోయాయి.