ఇరాన్-అమెరికా ఇష్యూ: భారీగా పెరగనున్న పెట్రోల్ ధర, భారత్లో సామాన్యుడిపై భారమెలా?
న్యూఢిల్లీ: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో చమురు ధరలు మండుతున్నాయి. ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో క్రూడాయిల్తో బంగారం ధరలు పెరిగాయి. మార్కెట్లు నష్టపోయాయి. అయితే భారత కాలమానం ప్రకారం బుధవారం రాత్రి ట్రంప్ వ్యాఖ్యలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. క్రూడాయిల్, బంగారం ధరలు నిలకడగా ఉండేందుకు ఉపకరించాయి. అయితే ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. భారత్ పైన కూడా ప్రభావం ఎక్కువే పడింది.
72 డాలర్లకు క్రూడాయిల్
అంతర్జాతీయ మార్కెట్లో బుధవారం ఒక్కరోజే క్రూడాయిల్ ధర బ్యారెల్కు 4.5 శాతం ఎగబాకింది. న్యూయార్క్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 72 డాలర్లు పలికింది. బుధవారం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగడంతో ధరలు మండిపోయాయి. ఆ తర్వాత శాంతించిన సంకేతాలు రావడంతో ధరలు నిలకడగా ఉన్నాయి.
ఇంధన సరఫరాపై ప్రభావం లేదు
అయితే ప్రస్తుతానికి తిరిగి చల్లబడినప్పటికీ ముందు ముందు ఎలా ఉంటుందనే దానిపై ఈ ధరలు ఆధారపడి ఉంటాయి. నిన్నటి వరకు యుద్ద మేఘాలు కమ్ముకున్నప్పటికీ ఇంధన సరఫరాపై ఎలాంటి ప్రభావం పడలేదు. కానీ ఈ పరిణామాల ప్రభావం కొద్ది రోజులు ఉండవచ్చునని అంటున్నారు.
భారత్పై ప్రభావం ఎక్కువే
అమెరికా - ఇరాన్ మధ్య అనిశ్చితులు పెరిగితే భారత్ పైన ప్రభావం ఎక్కువే ఉంటుంది. భారత్ చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. మిడిల్ ఈస్ట్లో సరఫరా తగ్గి, చమురు ధరలు పెరిగితే కష్టాలు తప్పవు. ఓపెక్ దేశాల్లో సౌదీ అరేబియా తర్వాత పెద్ద చమురు సరఫరా చేసే దేశం ఇరాక్. ఇక్కడ సంక్షోభం తలెత్తితే ఉత్పత్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పటి వరకు సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. ప్రస్తుతం శాంతిమంత్రం పఠిస్తున్నందున కూడా దాదాపు చల్లారినట్లే. కానీ పరిస్థితులు విషమిస్తే మాత్రం భారత్ పైన ఆ ప్రభావం ఎక్కువగానే ఉంటుంది.
70 డాలర్లు దాటితే.. ద్రవ్యలోటు పెరుగుతుంది
అమెరికా - ఇరాన్ మధ్య పరిస్థితులు తీవ్రరూపం దాల్చితే అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతాయి. మన దేశంలో వినియోగిస్తున్న చమురులో 80 శాతం దిగుమతుల పైనే ఆధారపడుతున్నాం. బ్యారెల్ క్రూడాయిల్ 70 లేదా అంతకుమించి డాలర్లకు చేరుకుంటే దిగుమతి బిల్లు మరింత పెరిగి ద్రవ్యలోటు ఎక్కువ అవుతుంది.
80 శాతం దిగుమతులు
అమెరికా - ఇరాన్ మధ్య ఏడాది కాలంగా అనిశ్చితి ఉంది. ఇరాన్ చమురు పరిశ్రమ, బ్యాంకులపై 2018లో ట్రంప్ తొలిసారి ఆంక్షలు విధించారు. వారం క్రితం కీలక కమాండర్ ఖాసీమ్ను హతమార్చారు. దీంతో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచంలో అతిపెద్ద చమురు వినియోగదారుల్లో భారత్ 3వ స్థానంలో ఉంది. 80 శాతం చమురు అవసరాలు, 40 శాతం సహజవాయువు అవసరాలను దిగుమతుల ద్వారా తీర్చుకుంటున్నాం.
ఇప్పటికే భారం.. మరింత భారం
2018-19లో వీటి దిగుమతుల కోసం 111.9 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది భారత్. అంతక్రితం ఏడాది ఇది 87.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇరాక్, సౌదీ తర్వాత ఇరాన్ నుంచి భారత్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటుంది. ఇరాన్ పైన ఆంక్షల నేపథ్యంలో అమెరికా, వెనెజులా వైపు భారత్ చూస్తోంది. మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే చమురు.. బీమా, రవాణా ఛార్జీల మినహాయింపు వల్ల తక్కువ ధరకు వస్తుంది. కానీ ఇప్పుడు ఎక్కువ మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగితే సరఫరా తగ్గి చమురు ధరలు పెరిగితే మరింత ఎక్కువ ఖర్చు చేయవలసి ఉంటుంది.
10 డాలర్లు పెరిగితే 0.4 శాతం..
ఇప్పటికే భారత జీడీపీ ఆరేళ్ల కనిష్టానికి చేరుకుంది. అమెరికా - ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగితే మాత్రం మన ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 11 ఏళ్ల కనిష్టానికి చేరుకుంటుందని అంటున్నారు. ముడి చమురు ధరలు 10 డాలర్లు పెరిగినా భారత దిగుమతి బిల్లు 0.4 శాతం పెరుగుతుంది.
అందరి పైనా భారం
ఉద్రిక్తతల వల్ల భారత్ పైన భారం పడి.. అంతిమంగా అది ప్రభుత్వంపై అలాగే, వినియోగదారులపై కూడా పడుతుంది. ముడి చమురు ధరలు పెరిగితే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయి. రిటైలర్లు అంతర్జాతీయ రేట్ల ఆధారంగా రోజువారీ ధరలను నిర్ణయిస్తారు. కాబట్టి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంటే రానున్న రోజుల్లో పెట్రోల్ ధరలు పెరిగే అవకాశముంటుంది. పెట్రోల్ ధరలు పెరిగితే నిత్యావసర ధరలు కూడా పెరిగే అవకాశముంటుంది.