Petrol prices today: వరుసగా 20వ రోజు స్థిరంగా పెట్రోల్ ధరలు
పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఇరవయ్యవ రోజు (ఆగస్ట్ 6, శుక్రవారం) స్థిరంగా ఉన్నాయి. దాదాపు మూడు వారాలుగా ధరల్లో ఎలాంటి మార్పులేదు. అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. అయితే నేడు స్థిరంగా ఉన్నాయి. చివరిసారి లీటర్ పెట్రోల్ పైన 30 పైసలు పెరిగింది. గత నెల(జూలై)లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు ఒక్కసారీ పెరగలేదు. మే నెలలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల నిలిచింది. ఆ తర్వాత పలుమార్లు పెరిగినప్పటికీ, జూలై మిడిల్ నుండి పెరుగుదల లేదు.
దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.101.84, లీటర్ డీజిల్ రూ.89.87గా ఉంది. ముంబైలో పెట్రోల్ ధర ఢిల్లీ కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ రూ.107.83, డీజిల్ రూ.97.45గా ఉంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్ వంటి ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.110 క్రాస్ చేశాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ.100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ దాటింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.105.83, లీటర్ డీజిల్ రూ.97.76గా ఉంది.
పెట్రోల్ ధర రూ.100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పాట్నా, తిరువనంతపురం, పాట్నా, భువనేశ్వర్ తదితర నగరాలు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికం. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నులు. కేంద్రం పెట్రోల్ పైన రూ.32.90, డీజిల్ పైన రూ.31.80 వేస్తుంది. ఇక ఆయా రాష్ట్రాలు పన్నులు విధిస్తాయి. దీంతో ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ధరలు మారుతుంటాయి. రాజస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పైన అత్యధిక వ్యాట్ విధిస్తుంది. ఆ తర్వాత మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉన్నాయి.
ఇక అంతర్జాతీయ మార్కెట్లోనూ క్రూడాయిల్ ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్ వంటి అంశాల కారణంగా కాస్త పైకి చేరుకున్నాయి. ఇటీవల బ్రెంట్ క్రూడ్ ధర 70 డాలర్ల వద్ద ఉంది. చమురు డిమాండ్ పైన వినియోగం, ఒపెక్ దేశాల సరఫరా పెరుగుతుందనే అంశాల నేపథ్యంలో చమురు ధరలు ఇటీవల క్షీణించాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు ఎనిమిదేళ్ల గరిష్టం వద్ద ఉన్నాయని బ్రిటన్కు చెందిన RAC పేర్కొంది. లీటర్ పెట్రోల్ సగటున 135.13 పౌండ్స్ వద్ద ఉంది. సెప్టెంబర్ 2013 తర్వాత ఇదే గరిష్టం. డీజిల్ సగటున 137.06 పౌండ్స్ వద్ద ఉంది. 2014 నుండి ఇదే గరిష్టం.
మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు నేడు మధ్యాహ్నం పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.26 శాతం పెరుగుదలతో 70.56 డాలర్లకు చేరుకుంది. డబ్ల్యూటీఐ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు 0.34 శాతం పెరుగుదలతో 68.38 డాలర్లకు ఎగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒకరోజు పెరగవచ్చు.. మరొకరోజు తగ్గొచ్చ. లేదంటే స్థిరంగా కొనసాగవచ్చు.