పెట్రోల్, డీజిల్ రేట్లపై మళ్లీ అదే మోత: నాలుగు రోజుల్లో రూ.3కు పైగా
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల కొనసాగుతోంది. వాటి రేట్లను పెంచే విషయంలో చమురు కంపెనీలు ఒక్కరోజు మాత్రమే విరామాన్ని ఇచ్చాయి. మంగళ, బుధ వారాల్లో వాటి రేట్లను పెంచాయి. గురువారం విశ్రాంతిని ఇచ్చాయి. ఆ ఒక్క రోజు విరామం. మళ్లీ వరుసగా రెండు రోజులు పెట్రోల్, డీజిల్ రేట్లు ఎగబాకాయి. శుక్రవారం 80 పైసల మేర ధరలను పెంచిన చమురు సంస్థలు.. ఇవ్వాళ కూడా దాన్ని కొనసాగించాయి. అయిదు రోజుల రోజుల వ్యవధిలో నాలుగోసారి పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల కనిపించింది. ఫలితంగా- పలు నగరాల్లో పెట్రోల్ రేటు 110 రూపాయలను దాటింది.
మూడు రోజుల్లో రూ.3 పైగా..
పెట్రోల్, డీజిల్ ధరలను చమురుసంస్థలు తొలి రోజు లీటర్పై 80 పైసల మేర పెంచిన విషయం తెలిసిందే. రెండో రోజు కూడా అదే పెంపును కొనసాగించాయి. లీటర్పై 80 పైసలను పెంచాయి. ఇప్పుడు కూడా మళ్లీ అదే డోస్ ఇచ్చాయి చమురు కంపెనీలు. పెట్రోల్, డీజిల్పై లీటర్ ఒక్కింటికి 80 పైసల మేర పెంచాయి. ఈ అయిదు రోజుల్లో పెట్రోల్, డీజిల్పై అదనంగా పడిన భారం రూ. 3.20 పైసలు. 137 రోజుల సుదీర్ఘ విరామానికి బ్రేక్ ఇచ్చిన చమురు సంస్థలు.. అప్పుడు నెలకొన్న లోటును ఇప్పుడు భర్తీ చేసుకునేలా కనిపిస్తోన్నాయి.
వివిధ నగరాల్లో ఇలా..
పెరిగిన ధరల ప్రకారం.. దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.98.61 పైసలకు చేరింది. డీజిల్ రూ.89.87 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ113.35 పైసలు, డీజిల్ రూ.97.55 పైసలుగా నమోదైంది. కోల్కతలో పెట్రోల్ రూ.108.01 పైసలు, డీజిల్ రూ.93.01 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.104.43 పైసలు, డీజిల్ 94.47 పైసలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.103.93 పైసలు, డీజిల్ రూ.88.14 పైసలుగా ఉంటోంది. గుర్గావ్లో పెట్రోల్ రేటు రూ.99.08 పైసలు, డీజిల్ 90.30 పైసలు.
అక్కడ 114
గ్రేటర్ నోయిడాలో పెట్రోల్ రూ.90.21 పైసలు, డీజిల్ రూ.90.21 పైసలుగా ఉంటోంది. చండీగఢ్లో పెట్రోల్ రూ.98.06 పైసలు, డీజిల్ రూ.84.50 పైసలు పలుకుతోంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.111.80 పైసలు, డీజిల్ రూ.98.10 పైసలకు పెరిగింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్లోని పలు నగరాల్లో పెట్రోల్ 110 రూపాయలను దాటేసింది. అజ్మీర్, బికనేర్, శ్రీగంగానగర్లో పెట్రోల్ ధర రికార్డు స్థాయికి చేరుకుంది.
యుద్ధం ఎఫెక్ట్..
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర విపరీతంగా పెరిగిపోవడం వల్లే చమురు సంస్థలు ఆ భారాన్ని వాహనదారులపై మోపాయి. యుద్ధం ఆరంభమైన 40 శాతం క్రూడాయిల్ ధర పైకి ఎగబాకింది. యుద్ధం ఆరంభం కావడానికి ముందు రోజులతో పోల్చుకుంటే- ఈ రేటూ చాలా ఎక్కువ. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం భారత్పైనా పడింది. ఫలితంగా నాలుగు రోజుల్లో మూడోసారి ఇంధన రేట్లను పెంచాల్సి వచ్చినట్లు చమురు సంస్థలు చెబుతున్నాయి. ఈ పెరుగుదల ఇక్కడితో ఆగడం దాదాపు అసాధ్యమే.