వన్ నేషన్..వన్ పెట్రో రేట్: దినదినగండం: మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుదల విషయంలో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని చమురు సంస్థలు మరోసారి కొరడా ఝుళిపించాయి. తాజాగా వాటి రేట్లను పెంచేశాయి. ఈ నెలలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం ఇది 14వ సారి. అంటే నెలలో ఇప్పటికే సగం రోజులకు పైగా వాటి రేట్లను పెంచినట్టయింది. ధరలలను పెంచడంలో ఏ మాత్రం రాజీ ధోరణిని ప్రదర్శించట్లేదా ఆయిల్ కంపెనీలు. రోజూ పెరుగుతోన్న ధరలతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 110 రూపాయలకు చేరువ అవుతోంది. పలు చోట్ల డీజిల్ కూడా 100 రూపాయల మార్క్ను దాటేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా దీనికి మినహాయింపు కాదు.
పెట్రోల్, డీజిల్పై ఎంత పెరిగిందంటే..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ ఉదయం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్, డీజిల్పై జాయింట్గా 35 పైసల మేర పెరిగింది. ఇదివరకెప్పుడూ 35 పైసల మేర పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. తాజా పెంపుతో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.98.11, డీజిల్ 88.65 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ రేటు 104 మార్క్ను దాటింది. లీటర్ ఒక్కింటికి రూ.104.22 పైసలు పలుకుతోంది. డీజిల్ ధర 96.16కు చేరింది. చెన్నైలో పెట్రోల్ రూ. 98.19, డీజిల్ ధర రూ.93.23, కోల్కతలో పెట్రోల్ రూ.97.97 పైసలు, డీజిల్ ధర రూ.91.50 పైసలకు చేరింది.
హైదరాబాద్లో 102కు టచ్
తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర 102 రూపాయలకు టచ్ అవుతోంది. తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి హైదరాబాద్లో రూ.101.96 పైసలుగా నమోదైంది. డీజిల్ లీటర్ ఒక్కింటికి రూ.96.63 పైసలు. ఏపీ, తెలంగాణల్లోని అనేక జిల్లాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను దాటేసింది. భోపాల్లో పెట్రోల్-106.35, డీజిల్-97.37 రూపాయలకు చేరింది. బెంగళూరులో పెట్రోల్ రూ.101.39, డీజిల్ 93.99, లక్నోలో పెట్రోల్ రూ.95.29, డీజిల్ రూ.89.06 పైసలు పలుకుతోంది. తాజాగా బిహార్, కేరళలు వంద రూపాయల లిస్ట్లోకి చేరాయి. ఈ రెండు రాష్ట్రాల రాజధానులు పాట్నా, తిరువనంతపురంలల్లో పెట్రోల్ రేటు వంద దాటింది. పాట్నాలో పెట్రోల్ రూ.100.14 పైసలు, డీజిల్ రూ.93.99 పైసలు ఉండగా.. తిరువనంతపురంలో పెట్రోల్ రూ.100.09, డీజిల్ 95.19 పైసలకు చేరింది.
డీజిల్ రేటు దిమ్మ తిరిగేలా..
రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో డీజిల్ రేటు 101 రూపాయలను దాటేసింది. అక్కడ డీజిల్ లీటర్ ఒక్కింటికి 101.85 పైసలకు చేరింది. పెట్రోల్ కొత్త రికార్డు నెలకొల్పింది. రూ.110 రూపాయలకు చేరువైంది. పెట్రోల్ లీటర్ 109.30 పైసలుగా నమోదైంది. నిరాటంకంగా పెరుగుతూ వస్తోన్న ధరలతో అనేక రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పెట్రోల్ రేటు వంద రూపాయలను ఎప్పుడో దాటేసింది. ఏపీ, తెలంగాణ సహా మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, జమ్మూ కాశ్మీర్, ఒడిశా, లఢక్, బిహార్, కేరళల్లో వంద రూపాయలను దాటేశాయి. ఇప్పుడున్న ఇదే దూకుడు కొనసాగితే- పెట్రో రేట్లు 100 రూపాయల ల్యాండ్మార్క్ను దాటినట్టవుతుంది.