పేటీఎం షేర్ హోల్డర్లకు గుడ్న్యూస్: ఇవ్వాళ్టి ధర చెక్ చేశారా?
ముంబై: పేటీఎం.. గత సంవత్సరం నవంబర్లో ఇన్వెస్టర్ల ముందుకొచ్చిన బిగ్గెస్ట్ పబ్లిక్ ఇష్యూ. 18,500 కోట్ల రూపాయలను సమీకరించుకోవడానికి ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేసిందీ కంపెనీ. ఇన్వెస్టర్లకు అంచనాలకు మించిన ఆదరణ లభించిందీ ఐపీఓకు. కొన్ని సంవత్సరాలుగా మార్కెట్లో విస్తృతంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న సంస్థ కావడం వల్ల పేటీఎం షేర్లను కొనుగోలు చేయడానికి రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. లాభాలు వస్తాయని ఆశించారు.
పేటీఎం ఫ్లాప్ షో
బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ రోజు మాత్రం ఇన్వెస్టర్లను తీవ్ర నిరాశకు గురిచేసింది పేటీఎం పబ్లిక్ ఇష్యూ. నష్టాలతో లిస్టింగ్ అయింది. ఒక్కో షేర్ మీద వందల రూపాయల్లో నష్టాలను చవి చూడాల్సి వచ్చింది. బ్లాక్ బస్టర్ ఐపీఓగా భావిస్తుందనుకున్నప్పటికీ అట్టర్ ఫ్లాప్ అయింది. గత ఏడాది నవంబర్లో పేటీఎం ఐపీఓ జారీ అయిన విషయం తెలిసిందే. దాని ప్రైస్బ్యాండ్ 2,080 నుంచి 2,150 రూపాయలతో ఇన్వెస్టర్ల ముందుకొచ్చింది.
తొలి రోజు నుంచే..
ఇంత భారీ రేట్ పెట్టినప్పటికీ.. ఆ కంపెనీ మీద ఉన్న నమ్మకంతో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. లిస్టింగ్ రోజున సినిమా చూపించింది. ఏకంగా 1,564.15 రూపాయలతో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయింది. 2,150 రూపాయలను పెట్టి కొనుగోలు చేసిన ఒక్క షేర్.. లిస్టింగ్ రోజే 500 రూపాయల నష్టాన్ని ఇచ్చింది. ఆ తరువాత ఏ దశలో కూడా పేటీఎం షేర్లు పుంజుకోలేదు. ఓ సందర్భంగా 1,700 రూపాయల మార్క్ను దాటగలిగింది. ఆ తరువాత అంతా నేలచూపులే.
నష్టాల్లో ఉన్నా..
ప్రస్తుతం ఈ షేర్ ధర స్టాక్ మార్కెట్లో కొద్దిరోజులుగా 500 నుంచి 550 రూపాయల మధ్య ఊగిసలాడుతూ వచ్చింది. ఈ నెల 20వ తేదీన పేటీఎం కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను వెల్లడించిన తరువాత- ఈ షేర్ విలువ మరింత తగ్గుతుందనే అంచనాలు వెలువడ్డాయి. 763 కోట్ల రూపాయల మేర నష్టాన్ని చవి చూడటమే దీనికి కారణం. కోట్ల రూపాయల్లో నష్టాన్ని చవి చూసిన తరువాత పేటీఎం షేర్ల ధరలు భవిష్యత్తులో పెరుగుతాయనే ఆశ పెద్దగా ఎవరికీ ఉండకపోవచ్చు.
భారీగా పెరుగుదల..
దీనికి భిన్నంగా పేటీఎం షేర్ల ధరలు ఇవ్వాళ ఒక్కసారిగా పెరిగాయి. అనూహ్యంగా ఒక్కో షేర్ ధరలో ఎనిమిది శాతం మేర పెరుగుదల కనిపించింది. శుక్రవారం నాడు ముగిసిన ట్రేడింగ్తో పోల్చి చూస్తే.. ఇవ్వాళ రూ.42.50 పైసల మేర పెరిగింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. ఈ ఉదయం 561 రూపాయలతో ఆరంభమైన పేటీఎం షేర్ల ట్రేడింగ్.. సాయంత్రం మార్కెట్స్ క్లోజ్ అయ్యే సమయానికి 618.50 పైసలకు చేరింది. ఒకదశలో 627 రూపాయల వరకు వెళ్లి.. మళ్లీ తగ్గింది.