సైబర్ ఫ్రాడ్, క్రెడిట్ కార్డ్ ఇవ్వకున్నా.. బిలియనీర్ కూతురు అకౌంట్ నుండి డబ్బులు డ్రా
పల్లోంజీ షాపూర్జీ మిస్త్రీ కూతురు లైలా రుస్తుం(62)కు చెందిన బ్యాంకు ఖాతా నుండి గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా రూ.90వేలు ఉపసంహరించారు. జూలై నెలలో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించి దక్షిణ ముంబైలోని కొలబా పోలీస్ స్టేషన్లో సైబర్ నేరం కేసు నమోదయింది. జూలై నెలలో మిస్త్రీ నేతృత్వంలోని కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజర్(అకౌంట్స్) జయేష్ మర్చంట్కు బ్యాంకు ఖాతా నుండి నగదు ఉపసంహరించినట్లు మొబైల్ సందేశం వచ్చింది. దీంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఇది మిస్త్రీ ఇద్దరు కూతుళ్లలో ఒకరైన లైలా రుస్తుంకు చెందిన బ్యాంకు ఖాతా. లైలా దుబాయ్లో ఉంటున్నారు.
టాటా గ్రూప్Xమిస్త్రీ గ్రూప్: 70 ఏళ్ళ బంధం.. వ్యాల్యుయేషన్ సవాలేనా?
ట్రాన్సాక్షన్ కోసం ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు
లైలా రుస్తుం తరఫున తండ్రికి బ్యాంకు ఖాతాను నిర్వహించే అధికారం ఉంది. 2018లో కంపెనీ డైరెక్టర్ ఫిరోజ్ భటెనాకు ఖాతా నిర్వహణ అధికారాన్ని మిస్త్రీ ఇచ్చారు. భటేనా ఈ బాధ్యతలను జయేష్ మర్చంట్కు అప్పగించారు. బ్యాంకు ట్రాన్సాక్షన్స్ నిర్వహణ కోసం కంపెనీ అధికారులు జయేష్ మొబైల్ నెంబర్ను బ్యాంకుకు అందించారు. ఈ సైబర్ మోసపూరిత ట్రాన్సాక్షన్ సందేశం మొబైల్ ఫోన్కు రావడంతో ఘటన వెలుగు చూసింది. కేసు నమోదయినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. బ్యాంకు ఖాతా చాలా కాలం నుండి కొనసాగుతోంది. చెక్ రూపంలో ఎక్కువగా ఉపసంహరణలు జరిగాయి.
నగదు ఉపసంహరణ...
నగదు ఉపసంహరణకు సంబంధించి సందేశం వచ్చిన అనంతరం జయేష్ మర్చంట్ బ్యాంకుకు ఫోన్ చేసి అడిగారు. డబ్బులు ఎలా విత్ డ్రా అయ్యాయో చెప్పాలని అడిగారు. డెబిట్ కార్డును ఉపయోగించి పలు ట్రాన్సాక్షన్స్లో రూ.90వేలు తీసుకున్నట్లు తెలిపారు. దీంతో జయేష్ మర్చంట్ కొలాబా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ 420(చీటింగ్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తిపై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 66సీ, 66డీ కింద కేసు నమోదు చేశారు.
అసలు డెబిట్ కార్డు జారీ చేయలేదు
డెబిట్ కార్డు ద్వారా ఈ మొత్తాన్ని ఉపసంహరించుకున్నట్లు తేలినప్పటికీ, అసలు ఈ అకౌంట్కు డెబిట్ కార్డును జారీ చేయలేదని జయేష్ మర్చంట్ బ్యాంకు మేనేజర్కు తెలిపారు. అయితే భటేనా పేరు మీద 2018లో క్రెడిట్ కార్డు జారీ చేసినట్లు బ్యాంకు అధికారులు తెలియజేయడంతో జయేష్ మర్చంట్ ఆశ్చర్యపోయారు. ఈ కార్డును కొలబాలోని కార్యాలయానికి కొరియర్ చేసినట్లు రికార్డులో ఉంది. డబ్బును ఉపసంహరించుకోవడానికి అదే డెబిట్ కార్డు ఉపయోగించినట్లు తేలింది. ఆఫీస్కు చెందిన వారు ఎవరు కూడా డెబిట్ కార్డు కోసం దరఖాస్తు చేయలేదు.