pakistan: పొదుపు చేయడానికి పాకిస్థాన్ ఇలా చేస్తుందంట.. కానీ మీడియా మాత్రం..
pakistan: దాయాది పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే పొరుగు దేశం శ్రీలకం దివాళా తీయగా.. అనధికారికంగా పాక్ పరిస్థితి సైతం అదేనని ఏకంగా ఆ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. IMF నుంచి రుణం పొందాలంటే దాని షరతులకు లోబడాల్సిందే. అందులో భాగంగా పాక్ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలపై పెద్ద మొత్తంలో పన్నుల భారాన్ని మోపింది. తాజాగా ఖర్చులు తగ్గించుకునేందుకు గాను విదేశాంగ శాఖకు సంబంధించి భారీ మార్పులు చేయడానికి సిద్ధమైంది.
15 శాతం ఖర్చులు కట్:
వృథా ఖర్చులను అదుపుచేయడం కోసం విదేశాల్లో నిర్వహిస్తున్న కార్యకలాపాలను తగ్గించాలని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశించారు. కార్యాలయాలతో పాటు సిబ్బంది సంఖ్యలోనూ కోత విధించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. మొత్తం 15 శాతం ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ ఆదేశాలు జారీచేసినట్లు పేర్కొంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను రెండు వారాల్లోగా పీఎంవోకు సమర్పించాలని చెప్పినట్లు తెలిపింది.
మంత్రివర్గంలో బేధాభిప్రాయాలు:
'విదేశీ కార్యకలాపాల హేతుబద్ధీకరణ' పేరిట అధికారిక ప్రకటనను ప్రధాని కార్యాలయం విదేశాంగ శాఖకు పంపినట్లు మీడియా వెల్లడించింది. దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు ఏర్పాటు చేసిన జాతీయ పొదుపు కమిటీ సూచనల మేరకు.. విదేశీ మిషన్ల నుంచి 15 శాతం వ్యయాన్ని తగ్గించాలని అందులో పేర్కొంది. అయితే వీటి అమలుకు మంత్రివర్గంలోని సభ్యుల మధ్య బేధాభిప్రాయాలు వచ్చినట్లు తెలిపింది. విద్యుత్, గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచినా.. వృథా ఖర్చులను మాత్రం తగ్గించుకోవడం లేదని వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
మరోసారి ఐరన్ బ్రదర్ గాలం:
700 మిలియన్ డాలర్ల రుణ సదుపాయాన్ని చైనా డెవలప్మెంట్ బ్యాంక్ బోర్డు ఆమోదించినట్లు పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సోషల్ మీడియాలో ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీలు సైతం పూర్తయినట్లు తెలిపారు. ఆ మొత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ కు ఈ వారంలో అందనున్నట్లు చెప్పారు. తద్వారా ఫారెక్స్ నిల్వలు పెరుగుతాయని స్పష్టం చేశారు. జూన్ చివరి నాటికి విదేశీ మారక ద్రవ్య నిల్వలు.. మీడియా ఊహించిన దానికంటే మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.