కరోనా పాలసీలకు యమ డిమాండ్, 15 లక్షలమంది తీసుకున్నారు
కరోనా మహమ్మారి నేపథ్యంలో డిమాండ్ ఆధారిత బీమా పథకాలు పెరిగాయని ఇటీవలి కాలంలో మార్కెట్లోకి వచ్చిన కరోనా పాలసీలను దేశవ్యాప్తంగా 15 లక్షల మంది తీసుకున్నారని ఇన్సురెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ(IRDAI) చైర్మన్ సుభాష్ సీ కుంతియా వెల్లడించారు. ప్రస్తుత క్లిష్ట సమయంలో పాలసీదారులకు రక్షణ కల్పించే పాలసీలను ప్రవేశపెట్టాలని బీమా సంస్థలకు సూచించారు. కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని దృష్టిలో పెట్టుకొని గత నెలలో కరోనా కవాచ్, కరోనా రక్షక్ పాలసీలు వచ్చాయి.
ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ, అత్యధిక శాలరీ ఈ దంపతులదే! కూతురుకు కోట్ల శాలరీ
ఇది బీమా కంపెనీల బాధ్యత
కరోనా సంక్షోభ సమయంలో ప్రజలకు అండగా ఉండటం బీమా కంపెనీల బాధ్యత అని, అందుకే కరోనా కవచ్, కరోనా రక్షక్ పాలసీలు తీసుకురావాలని ఆదేశించినట్లుగా తెలిపారు. 'ఫిక్కీ ఫిన్కాన్2020, కరోనా అనంతర ప్రపంచంలో భారత బీమా రంగం' పేరిట నిర్వహించిన వార్షిక సదస్సులో మాట్లాడారు. మారుతున్న కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా బీమా కంపెనీలు స్పందించాలన్నారు. ఉత్పత్తులు, వ్యాపార కార్యకలాపాలన్నింటిలోను కొత్త ధోరణులు అనుసరించాలన్నారు.
అంతా బాగుంటే ఎవరూరారు
బీమారంగం అంటే ప్రతికూలత స్వభావం కలదని, అంతా బాగుంటే ఎవరూ బీమా రక్షణ వైపు చూడరని, కానీ ఏదైనా అనుకోని ప్రమాదం ముంచుకొస్తుందని భావిస్తో మాత్రం మొగ్గు చూపుతారన్నారు. చిన్న, మధ్యతరహా రంగ కార్మికులకు గ్రూప్ బీమా పాలసీల కింద రక్షణ ఇవ్వడం మంచి వ్యాపారావకాశమన్నారు. కష్టకాలంలో పాలసీదారుపై ఆర్థిక భారం పడకుండా బీమా సంస్థలు పాలసీదారులకు రక్షణ కల్పించాలన్నారు. వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వినూత్న పాలసీలను తీసుకు రావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో బీమా సంస్థలు ఆ దిశగా కృషి చేయడం అభినందనీయమన్నారు.
అప్పుడే నమ్మకం
ప్రజల అవసరాన్ని గుర్తించి, సరళమైన, పారదర్శక ఉండే పాలసీలను అందించినప్పుడే బీమాపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని తెలిపారు. ఆరోగ్య సంజీవని హెల్త్ ఇన్సురెన్స్ గురించి మాట్లాడుతూ... దీనిని ప్రామాణిక ఉత్పత్తిగా అందించాలని, పోటీగా చూడకూడదన్నారు.