'ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు': మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం, వీరికి ప్రయోజనం
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సామాన్యులకు ప్రయోజనకరంగా ఉండే పలు సంస్కరణలు చేపడుతోంది. తాజాగా, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్లే వారికి ప్రయోజనం చేకూర్చే దిశగా కేంద్రం కీలక అడుగులు వేసింది. దేశవ్యాప్తంగా లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే ఒకే దేశం-ఒకే రేషన్ కార్డు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మోడీ ప్రభుత్వం ఈ సంస్కరణ వల్ల ఆంధ్రప్రదేశ్ లోని వారు తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఏపీలో కూడా రేషన్ తీసుకోవచ్చు.
మధ్య తరగతి భక్తులకు భారం: తిరుమలలో గదుల ధర రెండింతలు
దేశమంతా ePoS యంత్రాలు
రేషన్ కార్డు పోర్టబులిటీని (ఎక్కడైనా రేషన్ తీసుకునేలా) ప్రారంభించేందుకు దేశమంతా అన్ని రేషన్ షాపుల్లో ePoS యంత్రాలను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నామని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సెక్రటరీ రవి కాంత్ అన్నారు. లబ్ధిదారులకు అప్పటికే రేషన్ కార్డు ఉండి ఉంటే.. వారు మరో ప్రాంతానికి లేదా మరో రాష్ట్రానికి తరలి వెళ్లినప్పుడు కొత్త రేషన్ కార్డు తీసుకోకుండా దాని పైనే రేషన్ ఇస్తారు. ఇదే రేషన్ కార్డు పోర్టబులిటీ ముఖ్య ఉద్దేశ్యం.
కార్మికులు, కూలీలకు ఎంతో ప్రయోజనం
వలస కార్మికులు, కూలీలు, రోజువారీ కూలీలకు ఇది ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వీరు తమ ఉపాధి కోసం నిత్యం ప్రాంతాలు లేదా రాష్ట్రాలు మారుతుంటారు. ఇలాంటి వారి కోసం ఇది ఉపయోగపడుతుంది. వీరు తమ రాష్ట్రాలు జారీ చేసిన రేషన్ కార్డు ఆధారంగా ఏ రాష్ట్రంలో అయినా బయోమెట్రిక్ ప్రామాణికం ద్వారా తమ కుటుంబం కోసం రేషన్ సరుకులు తీసుకోవచ్చు.
ఏ రాష్ట్రంలో అయినా...
ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ పీడీఎస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, త్రిపుర తదితర రాష్ట్రాల్లో ఉంది. ఈ రాష్ట్రాల ప్రజలు ఆ రాష్ట్రంలోని ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంది. ఇప్పుడు కేంద్రం సంస్కరణ ద్వారా ఏ రాష్ట్రంలోనైనా తీసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అన్ని రేషన్ కార్డుల సెంట్రల్ రిపోజిటరీని ఏర్పాటు చేస్తోంది. లబ్ధిదారులందరినీ జాతీయస్థాయిలో డీ-డూప్లికేషన్ చేసిన తర్వాత డేటా అప్ లోడ్ చేస్తారు. డీ-డూప్లికేషన్ తర్వాత సెంట్రల్ రిపోజిటరీలో పేర్లు ఉన్న లబ్ధిదారులకు మాత్రమే రేషన్ కార్డు పోర్టబులిటీ ఉంటుంది.
ఏపీ, తెలంగాణలలో తొలి రేషన్ పంపిణీ
ఒకే దేశం.. ఒకే రేషన్ కార్డు విధానాన్ని ప్రయోగాత్మకంగా ఇటీవల అమలులోకి తెచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గుజరాత్కు చెందిన రెండు క్లస్టర్లుగా రేషన్ పంపిణీ ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర ఆహార భద్రతా శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి ఆన్ లైన్ ద్వారా శుక్రవారం (15-11-2019) ప్రారంభించారు. హైదరాబాదులో ఆదర్శ్ నగర్ కాలనీలోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, విజయవాడలోని ఓ రేషన్ షాపు దుకాణంలో ఈ విధానం ద్వారా తొలిసారి రేషన్ పంపిణీ చేశారు. ప్రయోగాత్మకంగా వన్ నేషన్-వన్ రేషన్ కార్డు విధానాన్ని అమలు చేస్తున్నామని, నేషనల్ పోర్టబులిటీ తెలంగాణ - ఏపీ క్లస్టర్ ద్వారా సేవలు అందిస్తున్నామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ తెలిపారు.