21 ఏళ్ల కనిష్టానికి చేరిన చమురు ధరలు: నష్టం-లాభం ఎవరికంటే?
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా జనజీవనం దాదాపు స్తంభించిపోయింది. దీంతో చమురుకు డిమాండ్ తగ్గి, ధరలు భారీగా పడిపోయాయి. ఈ వైరస్ రోజు రోజుకు వ్యాప్తి చెందుతుండటంతో భారత్ వంటి దేశాలు లాక్ డౌన్ పాటిస్తున్నాయి. డిమాండ్ తగ్గిపోవడంతో ఒపెక్ సహా చమురు ఉత్పత్తి దేశాలు ప్రొడక్షన్ తగ్గించాయి. అయినప్పటికీ డిమాండ్ పడిపోతుండటంతో ధరలపై ప్రభావం పడుతోంది.
కరోనా దెబ్బతో ఐటీ కంపెనీల సరికొత్త ప్రయోగం, రియల్ ఎస్టేట్కు దెబ్బ?
15 డాలర్లకు చమురు ధర
యూఎస్ బెంచ్మార్క్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ బ్యారెల్ 15 డాలర్లకు పడిపోయింది. ఇటీవల రష్యా, సౌదీ అరేబియా సహా ఒపెక్ దేశాలు చమురు ఉత్పత్తిని రోజుకు 9.7 మిలియన్ బ్యారెల్స్కు తగ్గించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. పరిస్థితులు ఇలాగే ఉంటే చమురు ధరలు మరింత దిగజారవచ్చునని మార్కెట్ నిపుణులు అంటున్నారు.
ఉత్పత్తి తగ్గింపుపై మరోసారి కీలక నిర్ణయం
చమురు ధరలు ఏకంగా 15 డాలర్లకు పడిపోయిన నేపథ్యంలో 21 ఏళ్ల తర్వాత ఈ స్థాయికి పడిపోయాయి. కరోనా దెబ్బకు క్రూడాయిల్ ధరలు రెండు దశాబ్దాలకు పడిపోవడం గమనార్హం. డిమాండ్ భారీగా పడిపోవడంతో ఉత్పత్తిదారులు 13 శాతం మేర కోత విధిస్తున్నారు. చమురు ఉత్పత్తి దేశాలు క్రితంసారి సమావేశమైన తర్వాత నుండి ధరలు 20 శాతం పడిపోయాయి. ఏప్రిల్ 21న జరిగే సమావేశంలో మరింత ఉత్పత్తి తగ్గింపుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చు.
అందరికీ నష్టమే కానీ..
కరోనా కారణంగా చమురు ఉత్పత్తిదారుల్లో ఎవరూ లాభపడని పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తి దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయి. వినియోగం తగ్గి ధరలు పడిపోవడంతో పెద్ద మొత్తంలో లాస్ అవుతున్నారు. ఈ దేశాలకు కొన్ని స్పాట్ ఒప్పందాలు, మరికొన్ని దీర్ఘకాలిక ఒప్పందాలు ఉంటాయి. స్పాట్ ఒప్పందాల కంటే దీర్ఘకాలిక ఒప్పందాలపై ఉన్నవారికి ఇప్పుడు కాస్త లాభించే విషయమంటున్నారు.
లాభపడేది వీరే
ప్రస్తుత పరిస్థితుల్లో విన్నర్స్ ఎవరంటే నిల్వ సామర్థ్యం అధికంగా ఉన్నవారు అని చెబుతున్నారు. ప్రస్తుతం డిమాండ్-ధర తగ్గిపోవడంతో నిల్వ సామర్థ్యం ఉన్న దేశాలు క్రూడ్ను దిగుమతి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్ ఇటీవల ఇదే ఆలోచన చేసిన విషయం తెలిసిందే.