కరోనా భయాలు, చమురు మార్కెట్కు మరోసారి భారీ దెబ్బ
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మరోసారి పడిపోయాయి. చరిత్రలో తొలిసారి చమురు ధరలు ప్రతికూలతను ఎదుర్కొంటున్నాయి. గత మూడు నెలలుగా ధరలు భారీగా పతనమవుతున్నప్పటికీ, కొద్ది రోజులుగా కరోనా భయాలు తగ్గడం, షట్ డౌన్లు ఎత్తివేయడంతో పుంజుకుంటున్నాయి. అయితే రెండోసారి కరోనా పుంజుకుంటుందనే ఆందోళనల నేపథ్యంలో చమురు ధరలపై ప్రభావం పడింది. ఫెడరల్ రిజర్వ్ కూడా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇప్పటికే బంగారం 'జీరో', చమురు ధరలు ఇలాగే ఉంటే రూపాయికి ప్లస్
3 శాతం పడిపోయిన చమురు ధరలు
నిన్నటి వరకు యూఎస్ ఆయిల్ ఇన్వెంటరీస్ అంచనాలకు మించి 5.7 మిలియన్ బ్యారెళ్లకు పెరిగాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ (WTI), బ్రెంట్ క్రూడాయిల్ ధరలు 3 శాతం చొప్పున పడిపోయాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 38.38 డాలర్లు, బ్రెంట్ 40.55 డాలర్లు పలికింది. WTI ఓ సమయంలో నాలుగు శాతం కూడా పడిపోయింది.
కరోనాకు అనుగుణంగా..
ఈక్విటీ, ఆయిల్ మార్కెట్లు భారీగా నష్టపోవడానికి కరోనా ప్రధాన కారణం. షట్ డౌన్ ఆంక్షలు ఎత్తివేసినప్పటికీ ఇంకా ఏ దేశం కూడా కరోనాకు ముందు నాటి సాధారణ పరిస్థితికి రాలేదు. సమీప కాలంలో అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదు. అమెరికాలో కరోనా కేసులు గత వారం కంటే ఇప్పుడు 4.1 శాతం పెరిగాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను కలవరానికి గురి చేస్తోంది. కరోనా కేసులకు అనుగుణంగా ఈక్విటీ, చమురు మార్కెట్ ధరలు కొనసాగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
చమురు డిమాండ్ క్షీణత
కరోనా, లాక్ డౌన్ సహా వివిధ కారణాల చమురు పరిశ్రమ క్షీణించింది. ఓ వైపు ఇటీవలి వరకు చమురుకు డిమాండ్ లేకపోవడంతో చమురు ఉత్పత్తి దేశాలు ఉత్పత్తిని తగ్గించాయి. అయినప్పటికీ డిమాండ్ లేక నిల్వలు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు కరోనా మహమ్మారి మళ్లీ పుంజుకుంటే చమురు ధరలు మరింతగా క్షీణించే ప్రమాదం ఉంది.