భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లో, సెన్సెక్స్ 750 పాయింట్లు జంప్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. సూచీలు రోజంతా సానుకూలంగానే కదలాడాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అనుకూల సంకేతాలు, దేశీయంగా సానుకూల జీడీపీ వృద్ధి రేటు, వాహన విక్రయాలు పుంజుకోవడం, కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం వేగవంతం కావడం వంటి అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును బలపరిచాయి. డాలర్తో మారకంతో రూపాయి వ్యాల్యూ రూ.73.50 వద్ద ముగిసింది. సెన్సెక్స్ టాప్ 30లో ఒక్క భారతీ ఎయిర్టెల్ మినహా అన్ని షేర్లు లాభాల్లోనే ముగిశాయి.
సెన్సెక్స్ 750 పాయింట్లు జంప్
క్రితం సెషన్లో సెన్సెక్స్ 49,099 పాయింట్ల వద్ద ముగిసింది. నేడు ప్రారంభమే 600 పాయింట్లకు పైగా ఎగిసింది. 49,747.71 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,058.42 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 49,440.00 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,702.50 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,806.80 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,638.85 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు సెన్సెక్స్ 749.85 పాయింట్లు లేదా 1.53% ఎగిసి 49,849.84 పాయింట్ల వద్ద, నిఫ్టీ 232.30 పాయింట్లు లేదా 1.60% లాభపడి 14,761.50 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1921 షేర్లు లాభాల్లో, 1093 షేర్లు నష్టాల్లో ముగియగా, 189 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 50,000 పాయింట్లకు సమీపంలో ముగిసింది.
రిలయన్స్ జంప్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 6.04 శాతం,ONGC 5.45 శాతం, గ్రాసీమ్ 5.43 శాతం, UPL 5.17 శాతం, శ్రీసిమెంట్స్ 4.55 శాతం లాభపడ్డాయి.టాప్ లూజర్స్ జాబితాలో భారతీ ఎయిర్ టెల్ 4.33 ఉంది.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్లో భారతీ ఎయిర్ టెల్, టాటా మోటార్స్, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంకు, ఎస్బీఐ ఉన్నాయి.
రిలయన్స్ స్టాక్ నేడు 0.82 శాతం లాభపడి రూ.2,109 వద్ద క్లోజ్ అయింది.
రంగాలవారీగా...
నిఫ్టీ 50 సూచీ 1.60 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1.73 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 2.38 శాతం, నిఫ్టీ బ్యాంకు 1.41 శాతం, నిఫ్టీ ఎనర్జీ 1.95 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.79 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.09 శాతం, నిఫ్టీ ఐటీ 1.05 శాతం, నిఫ్టీ మీడియా 4.31 శాతం, నిఫ్టీ మెటల్ 1.94 శాతం, నిఫ్టీ ఫార్మా 1.38 శాతం, నిఫ్టీ రియాల్టీ 1.33 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 1.36 శాతం లాభపడ్డాయి. నిఫ్టీ పీఎస్యూ బ్యాంకు 0.36 శాతం నష్టపోయింది.