భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు.. కారణాలివే, 'అదానీ' షాక్
ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం(ఆగస్ట్ 24) లాభాల్లో ముగిశాయి. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల అండతో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 364.36 పాయింట్లు లేదా 0.95% ఎగిసి 38,799.08 వద్ద, నిఫ్టీ 94.90 పాయింట్లు 0.83% లాభపడి 11,466.50 వద్ద ముగిసింది. 1500 షేర్లు లాభాల్లో, 1109 షేర్లు నష్టాల్లో ముగియగా, 136 షేర్లలో ఎలాంటి మార్పులేదు. ఉదయం లాభాల్లోనే ప్రారంభమైన మార్కెట్లు, ఆ తర్వాత అంతకుమించి లాభాలతో ముగిశాయి. ఈ రోజు పదుల సంఖ్యలో కంపెనీలు క్వార్టర్ ఫలితాలు ప్రకటిస్తున్నాయి. అదానీ గ్రూప్ ముంబై విమానాశ్రయంలో 74% వాటాను సొంతం చేసుకుంటుందని వార్తలు రావడంతో ఉదయం ఈ కంపెనీ షేర్లు ఎగిసిపడ్డాయి.
రిలయన్స్, అమెజాన్కు షాక్: టాటా 'సూపర్ యాప్', ఈ సేవలన్నీ అందుబాటులో..
అదానీ పోర్ట్స్ నష్టాల్లో..
టాప్ గెయినర్స్ జాబితాలో జీ ఎంటర్టైన్మెంట్, కొటక్ మహీంద్రా, ఇండస్ ఇండ్ బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఉండగా, టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, అదానీ పోర్ట్స్, హిండాల్కో, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా ఉన్నాయి. ముంబై విమానాశ్రయంలో మెజార్టీ వాటాను సొంతం చేసుకుంటుందని ఉదయం వార్తలు వచ్చాయి. దీంతో అదానీ పోర్ట్స్ షేర్లు ప్రారంభంలో భారీ లాభాల్లోకి వచ్చాయి. కానీ ఇంకా చర్చల దశలోనే ఉన్నట్లుగా తెలియడంతో దాదాపు 1 శాతం నష్టాల్లో ముగిసింది.
అందుకే లాభాల్లో మార్కెట్లు
ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు, మధ్యాహ్నం భారీ లాభాల్లోకి వెళ్లింది. సెన్సెక్స్ ఓ దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. చివరకు 364 పాయింట్ల లాభంతో ముగిసింది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్ల అండతో మార్కెట్లు దూసుకెళ్లాయి. లాక్ డౌన్ తర్వాత ఆర్థిక కార్యకలాపాలు తిరిగి పుంజుకోవడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. వినోద రంగానికి సంబంధించి భారీ ఊరట కలిగింది. షూటింగ్స్ ప్రారంభించుకోవచ్చునని కేంద్రం అనుమతులు ఇచ్చింది. ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి.
పెట్టుబడులు
నగదు విభాగంలో క్రితం వారం చివరి సెషన్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(FPI) రూ. 410 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేయగా, దేశీ ఫండ్స్ (డీఐఐలు) దాదాపు రూ.251 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. గురువారం FPIలు రూ.268 కోట్లు, DIIలు రూ.672 కోట్లు చొప్పున పెట్టుబడులు వెనక్కి తీసుకున్నాయి.