ఆటోమొబైల్స్ లో కొత్త పెట్టుబడులు కష్టమే : సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా
దేశంలో ఆటోమొబైల్ రంగంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. కొత్తగా అమల్లోకి రాబోయే నిబంధనల నేపథ్యంలో మరిన్ని పెట్టుబడులు పెట్టే పరిస్థితి ఆటోమొబైల్ రంగంలో లేదని వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రెసిడెంట్ రాజన్ వధేరా వ్యాఖ్యానించారు. ఇప్పటికే కుదేలైన ఆటో మొబైల్స్ లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపించటం లేదన్నారు. భారతదేశం అమలు చేస్తున్న ప్రమాణాలు ప్రపంచంలోని కఠిన నిబంధనలకు సమానంగా ఉన్నాయని రాజన్ వధేరా వ్యాఖ్యానించారు.
అమెజాన్ ఇండియా ..పండుగ సీజన్ లో దూసుకుపోయే ప్లాన్ .. ఫాస్ట్ గా డెలివరీ కోసం 5కొత్త సార్టింగ్ సెంటర్ల
సియామ్ 60 వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన రాజన్ వధేరా 2022 నుండి అమల్లోకి వచ్చే సిఏఎఫ్ఈ నిబంధనలకు అనుగుణంగా తయారు చేసేందుకు కావాల్సిన పెట్టుబడి పెట్టె స్తోమత ఆటోమొబైల్ పరిశ్రమలకు లేవని ఆయన పేర్కొన్నారు. ఇక ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2026 లో నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడం కోసం ప్రభుత్వం మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని వధేరా నొక్కి చెప్పారు.
ఆటోమోటివ్, ఆటోమొబైల్స్ పరికరాల పరిశ్రమ 2020 నాటికి ఏ స్థాయిలో ఉండాలి, దేశ ఆర్థిక అభివృద్ధి లో ఏ స్థాయిలో ఆటోమొబైల్స్ తమ వంతు పాత్ర పోషించాలి తదితర అంశాలపై అటు ప్రభుత్వం ఇటు ఆటోమొబైల్ పరిశ్రమ కలిసి ఆటోమోటివ్ మిషన్ ప్లాన్ 2026 రూపొందించుకున్నదని గుర్తు చేసిన రాజన్ వధేరా ప్రభుత్వం తోడ్పాటును ఇస్తేనే అది సాధ్యం అవుతుంది అంటూ పేర్కొన్నారు.
ప్రస్తుతం జీడీపీ 7%గా ఉన్న ఆటో పరిశ్రమ వాటాను 12%కి పెంచుకోవాలని, ఇప్పటికే ఉన్న 3.7 కోట్ల ఉద్యోగాలకు అదనంగా 6.5 కోట్ల ఉద్యోగాలు కల్పించాలని నిర్దేశించుకున్నారు. 2026 నాటికి వాహన ఉత్పత్తిని 6.6 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆటోమొబైల్ రంగం ప్రగతి పథంలో దూసుకు వెళ్లాలంటే ప్రభుత్వ రాయితీలు ఇవ్వడంతో పాటుగా, పరిశ్రమకు బాసటగా నిలవాల్సిన అవసరముందని రాజన్ వధేరా పేర్కొన్నారు.