దేశంలో దారిద్య్రం ఏ స్థాయిలో ఉంది.. దేశవ్యాప్త సర్వేను లాంచ్ చేసిన కేంద్రం
దేశంలో నెలకొన్న దారిద్య్ర పరిస్థితులను అంచనా వేసేందుకు దేశవ్యాప్త సర్వేను కేంద్రం ప్రారంభించింది. ఇల్లు,మౌలిక సదుపాయాలు,పౌష్టికాహారం,తాగునీరు,వంట గ్యాస్ వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పేదరికానికి సంబంధించిన గణాంకాలను లెక్కగట్టనుంది. సంక్షేమ పథకాల అమలు విషయంలో దేశంలో ఉన్న పేదల సంఖ్య,దారిద్ర్య పరిస్థితులకు సంబంధించిన లెక్కలు కీలకం కాబట్టి ప్రభుత్వం ఈ సర్వే చేపడుతోంది
పేదరికం,దారిద్య్రంపై చివరిసారిగా టెండూల్కర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకుని సి.రంగరాజన్ కమిటీ ఇచ్చిన నివేదికలో దేశంలో పేదల సంఖ్య మరో 10కోట్లు పెరిగినట్టు వెల్లడైంది. అయితే ఆ కమిటీ రిపోర్టును 2014లో ఎన్డీయే ప్రభుత్వం పక్కనపెట్టింది. ఆరేళ్ల తర్వాత మళ్లీ దేశంలో పేదరికం,దారిద్ర్య పరిస్థితులను లెక్కకట్టేందుకు సిద్దమైంది.
ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ పర్యవేక్షణలో స్టాటిస్టిక్స్&ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్(MoSPI) మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించనుంది. సర్వే ఆధారంగా వెల్లడయ్యే ఫలితాలను యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP)కి సంబంధించిన బహుముఖ దారిద్య్ర ఇండెక్స్(MPI)లో పొందుపరుస్తారు. దేశంలో ఉన్న దారిద్య్రాన్ని లెక్కకట్టేందుకు.. దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి.. ఎలాంటి పద్దతులను అనుసరించాలి అన్నదానిపై ఇటీవల నీతి ఆయోగ్ అధికారులు,స్టాటిస్టిక్స్&ప్రోగ్రామ్ అధికారులు భేటీ అయి చర్చించారు. సర్వేలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా నీతి ఆయోగ్ ఆయా రాష్ట్రాలకు ర్యాంకులను రూపొందిస్తుంది. తద్వారా దారిద్య్ర నిర్మూలనకు రాష్ట్రాల మధ్య పోటీ నెలకొని.. యునైటెడ్ నేషన్స్ పోవర్టీ ఇండెక్స్ ర్యాంకులో భారత్ ర్యాంకు మెరుగుపడేందుకు అది దోహదపడుతుందని భావిస్తున్నారు.
ప్రపంచ ప్రామాణికత ప్రకారం.. దారిద్య్రాన్ని కేవలం ఆదాయంతోనే ముడిపెట్టి చూడరు. అందులో ఆరోగ్య ప్రమాణాలు,నాణ్యత లేని పని,పొంచివున్న హింస వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇక యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి సంబంధించిన మల్టీ డైమెన్షనల్ పోవర్టీ ఇండెక్స్(MPI)మూడు ముఖ్య అంశాలకు సంబంధించి 10 పాయింట్లను పరిగణలోకి తీసుకుంటుంది. అందులో విద్య(పౌష్టికాహారం,చిన్నపిల్లల మరణాలు),విద్య(స్కూలింగ్ ఇయర్స్,స్కూల్ అడ్మిషన్స్),జీవన ప్రమాణాలు(తాగునీరు,సానిటేషన్,విద్యుత్,వంటగ్యాస్,ఫ్లోర్,ఆస్తులు) వంటివి ఉంటాయి.