ఫండ్స్ మెరుపుల్: ఈ ఏడాదిలో రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు... ఆల్ టైం రికార్డ్
ఏ రంగంలోనైనా పెట్టుబడులు పెరగాలంటే ముందు ఆ రంగం పై ఇన్వెస్టర్లకు విశ్వాసం కలగాలి. ఈ విశ్వాసమే అనేక రంగాలను ముందడుగు వేయిస్తుంది. ఇందుకు నిదర్శనమే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు. ఈ ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడులు 4 లక్షల కోట్ల రూపాయలకు కు పైగా పెరిగాయి. ఇన్వెస్టర్లలో విశ్వాసం పెరిగే విధంగా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు అఫ్ ఇండియా (సెబీ) తీసుకున్న చర్యలు ఫలిస్తున్నాయి. కొత్త సంవత్సరంలోనూ ఇదే విధంగా పెట్టుబడుల జోరు కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
5 ఏళ్ల క్రితం రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేస్తే ఈ రోజు రూ.18 లక్షలు
18 శాతం వృద్ధి
* మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ నిర్వహణ లోని ఆస్తుల్లో మెరుగైన వృద్ధి నమోదయింది. ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకే వీటి ఆస్తులు గత ఏడాది డిసెంబర్ చివరితో పోల్చితే 18 శాతం మేర (4.2 లక్షల కోట్ల రూపాయలు) పెరిగి ఇంతకు ముందెన్నడూ లేని గరిష్ట స్థాయిలో 27 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ చివరి నాటికి పెట్టుబడులు 22.86 లక్షల కోట్లుగా ఉన్నట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫి) వద్ద అందుబాటులో ఉన్న గణాంకాల ద్వారా తెలుస్తోంది. అయితే డిసెంబర్ చివరి నాటికి నవంబర్ చివరి నాటికీ ఉన్న దానికన్నా పెట్టుబడులు కాస్త తగ్గ వచ్చంటున్నారు.
డెట్ ఫండ్స్ లోకి ఎక్కువ
* డెట్ ఆధారిత పథకాల్లోకి ఎక్కువగా పెట్టుబడులు తరలి రావడం వల్ల మొత్తం పెట్టుబడులు పెరిగే అవకాశం ఏర్పడింది. ఈ ఏడాదిలో ఈక్విటీ మార్కెట్లో తీవ్రమైన హెచ్చుతగ్గులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ఫండ్స్ లోకి పెట్టుబడులు తగ్గిపోయాయి. అయితే కొత్త ఏడాదిలో మాత్రం పరిస్థితులు మెరుగ్గా ఉంటాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశ ఆర్ధిక వ్యవస్థ వచ్చే ఏడాదిలో పుంజుకోవడానికి అవకాశం ఉంటుందని, ఇది ఈక్విటీ మార్కెట్లు వృద్ధి చెందడానికి దోడపడవచ్చని అంటున్నారు.
ప్రతికూల పరిస్థితులు ఉన్నా...
* ఇంతకు ముందు సంవత్సరాల కన్నా ఈ ఏడాదిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. దేశ ఆర్ధిక వ్యవస్థలో వృద్ధి మందగించడం వల్ల కొంత నిరాశా వాదం నెలకొన్నది. పరపతి సంక్షోభం, దేశీ స్టాక్ మార్కెట్లలో తీవ్ర హెచ్చుతగ్గులు ఉండటం వల్ల ఇన్వెస్టర్లలో గందరగోళ పరిస్థితి నెలకొన్నది. అయినప్పటికీ మ్యూచువల్ ఫండ్స్ పరిశ్రమలో మంచి వృద్ధి నెలకొన్నట్టు చెబుతున్నారు విశ్లేషకులు.
* ఈ ఏడాదిలో ఇన్వెస్టర్ల సంఖ్య 62 లక్షలకు పైగా పెరిగి 8.65 కోట్లకు చేరుకున్నట్టు అంచనా. ఇన్వెస్టర్ల ఫోలియోలు 1.3 కోట్లకు పైగా పెరిగాయి. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో 44 కంపెనీలు ఉన్నాయి. గత ఏడాదిలో పరిశ్రమ మొత్తంగా 18 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది.
పదేళ్లలో మూడు రేట్ల వృద్ధి
* పదేళ్ల కాలంలో మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ మూడు రేట్ల వృద్ధిని నమోదు చేసుకుంది. 2009 నవంబర్ లో ఈ పరిశ్రమ నిర్వహణలోని ఆస్తులు 8.22 లక్షల కోట్ల రూపాయలు ఉండగా 2019 నవంబర్ నాటికీ 27 లక్షల కోట్ల రూపాయలు చేరుకున్నాయి. ఇక క్రమానుగత పెట్టుబడి పథకాలు (సిప్) రిటైల్ ఇన్వెస్టర్లకు ఎక్కువగా ఆకర్షించాయి. ఈ ఏడాదిలో సగటున 8,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సిప్స్ ద్వారా వచ్చినట్టు గణాంకాల ద్వారా తెలుస్తోంది. సిప్స్ ద్వారా మ్యూచువల్ ఫండ్ సంస్థలు 90,000 కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించగలిగాయి.