Mukesh Ambani: ముఖేష్ అంబానీ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..! కారణమేంటో తెలుసా?
Mukesh Ambani: దేశంలో అతిపెద్ద బిలియనీర్, రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ జీతం సున్నా రూపాయలంటే మీరు నమ్మగలరా? కానీ అది నిజం. వరుసగా రెండో ఏడాది కూడా అంబానీ జీతం తీసుకోవటం లేదు. అసలు దీనికి కారణం ఏంటి? కంపెనీ ఎందుకు చెల్లించటం లేదు? ఇంతకు ముందు ఎంత జీతం అందుకునేవారు వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నిల్ శాలరీ..
గడచిన ఆర్థిక సంవత్సరంలో కరోనా కారణంగా వ్యాపారం ప్రభావితమైనప్పుడు అభివృద్ధిని పునరుద్ధరించడానికి తనకు జీతం అక్కర్లేదని ముఖేష్ అంబానీ ప్రకటించారు. కంపెనీ ఇదే విషయాన్ని 2020-21 వార్షిక నివేదికలో కూడా నివేదించింది. అయితే తాజాగా రెండో ఏడాది(2021-22) కూడా అంబానీ జీతం తీసుకోలేదు.
11 ఏళ్లుగా అదే జీతం..
ఇంతకుముందు రిలయన్స్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జీతం 2008-09 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.15 కోట్లుగా నిర్ణయించబడింది. ఈ వేతన రేటు గత 11 సంవత్సరాలుగా మారలేదు. ఇది 2019-20 వరకు అలాగే కొనసాగింది.
కంపెనీలో ఇతరులకు జీతం ఎంత?
అంబాజీ జీతం రూ.15 కోట్లు అయినప్పటికీ మిగిలిన అన్ని ప్రోత్సాహకాలతో కలిపి రూ.24 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. ముఖేష్ అంబానీ ఛైర్మన్, CEO అయినప్పటికీ గత 2 సంవత్సరాలుగా కంపెనీ నుంచి ఎటువంటి అలవెన్స్, షేర్లు లేదా ఇతర ప్రయోజనాలను పొందలేదని తెలుస్తోంది. అంబానీ బంధువులైన నిఖిల్, హిదాల్ మెస్వానీల జీతం మాత్రం రూ.24 కోట్లుగా ఉంది. కానీ ఈసారి రూ.17.28 కోట్లు కమీషన్ కూడా అందుకుంటున్నారు.
జీతం తగ్గింపు..
అదేవిధంగా మేనేజింగ్ డైరెక్టర్లు బీఎంఎస్ ప్రసాద్, పవన్ కుమార్ కపిల్ జీతాలు స్వల్పంగా తగ్గాయి. 2021-22లో ప్రసాద్ జీతం రూ.11.89 కోట్లు ఉండగా అది 2020-21లో అదే రూ.11.99 కోట్లకు తగ్గింది. అదే విధంగా పవన్ కుమార్ కపిల్ జీతం రూ.4.24 కోట్ల నుంచి రూ.4.22 కోట్లకు తగ్గించబడింది.