రూ.10,00,000 కోట్ల M-Cap మేజిక్ మార్క్, రిలయన్స్ వర్సెస్ టీసీఎస్: ఏ కంపెనీ రికార్డ్ సృష్టిస్తుంది
ముంబై: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) రూ.10,00,000 కోట్ల మార్కెట్ వ్యాల్యూకు దగ్గరయిన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా రిలయన్స్ మార్కెట్ వ్యాల్యూ వేగంగా పెరుగుతోంది. ఇటీవల 10 లక్షల కోట్ల ఎం-క్యాప్ సమీపానికి వచ్చింది. మంగళవారం బీఎస్ఈలో ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9.96 లక్షల కోట్లుగా నిలిచింది. దీంతో రికార్డ్ స్థాయికి సమీపంలో ఉంది.
రూ.9 లక్షల కోట్ల నుంచి రూ.10 లక్షల కోట్ల సమీపానికి చేరుకునేందుకు రిలయన్స్కు 21 సెషన్స్ పట్టింది. అలాగే రూ.8 లక్షల కోట్ల నుంచి రూ.9 లక్షల కోట్లకు చేరుకునేందుకు 20 సెషన్స్ తీసుకుంది. రిలయన్స్ షేర్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్యాలెంటర్ ఇయర్లో షేర్లు 40 శాతం వరకు పెరిగాయి. దీంతో ముఖేష్ అంబానీ ఆస్తులు 15.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
ప్రపంచవ్యాప్తంగా వేగంగా ఆదాయం పొందుతున్న టాప్ సెవన్లో ముఖేష్ అంబానీ నిలిచారు. ఇదే కాలంలో టెలికం మొగల్ కార్లోస్ స్లిమ్ ఆదాయం 4 బిలియన్ డాలర్లు పెరిగింది.
ప్లాంట్ కంటే డబుల్ సామర్థ్యంతో ఏపీలో వోల్టీ పెట్టుబడి
మార్కెట్ క్యాపిటల్ పరంగా భారత్లో రిలయన్స్ ఇండస్ట్రీస్కు పోటీ ఇస్తోన్న సంస్థ టాటాకు చెందిన టీసీఎస్. ప్రస్తుతం టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.7.81 లక్షల కోట్లుగా ఉంది. రిలయన్స్ తర్వాత రెండో స్థానంలో నిలిచింది.
ఈ ఏడాది సెప్టెంబర్ 19వ తేదీన టాటా గ్రూప్ మార్కెట్ వ్యాల్యూ భారీగా పెరిగింది. రిలయన్స్ సమీపానికి చేరుకుంది. అయితే ఆ తర్వాత నుంచి రిలయన్స్ 32 శాతం ర్యాలీ సాధించింది. అదే సమయంలో టీసీఎస్ మాత్రం కేవలం 1.04 శాతం మాత్రమే ర్యాలీ సాధించింది.
2016లో రిలయన్స్ జియో ప్రారంభించడానికి ముందు టాటా గ్రూప్ చాలా కాలం RIL కంటే ముందు నిలిచింది. వినియోగదారుల్లో బలమైన వృద్ధి, డిజిటల్ సేవల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వృద్ధి, టారిఫ్ కోసం ఇటీవలి ప్లాన్స్ వంటివి రిలయన్స్ ఇండస్ట్రీస్కు కలిసి వచ్చినట్లు షేర్ఖాన్ పేర్కొంది.
రిలయన్స్ షేర్లు వేగంగా ర్యాలీ అవుతున్నాయి. మరోవైపు, సెప్టెంబర్ త్రైమాసికంలో మార్జీన్ కోల్పోయిన ఏకైక టైర్ 1 ఐటీ వెండర్ టీసీఎస్. ఈ ఆర్థిక సంవత్సరంలో టీసీఎస్ సింగిల్ డిజిట్ వృద్ధి నుంచి మరింత ముందుకు సాగుతుందని భావిస్తున్నట్లు స్టాక్ బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.