అదరగొట్టిన ముహూరత్ ట్రేడింగ్, కొత్త ఏడాదిలో రికార్డులు: గంటలో ఈ స్టాక్స్ జంప్
సంవత్ 2077కు దేశీయ మార్కెట్లు లాభాలతో స్వాగతం పలికాయి. దీపావళి పండుగను పురస్కరించుకొని ఒక గంటపాటు నిర్వహించే ముహూరత్ ట్రేడింగ్లో సూచీలు అదరగొట్టాయి. ఆరంభంలో భారీ లాభాల్లోకి వెళ్లిన స్టాక్స్, ఆ లాభాలను పోగొట్టుకున్నాయి. శనివారం సాయంత్రం గం.6.15 సమయానికి సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 380 పాయింట్లు ఎగిసింది. ఆ తర్వాత ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్కు మొగ్గు చూపడంతో లాభాలు కొంత ఆవిరయ్యాయి.
ప్రారంభంలో 381 పాయింట్లు జంప్
బీఎస్ఈ సెన్సెక్స్ 381 పాయింట్లను కొత్త జీవితకాల గరిష్టస్థాయిని తాకింది. 30 షేర్ల ఇండెక్స్ ట్రేడ్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లో 380.76 పాయింట్లు లేదా 0.88 శాతం పెరిగి 43,823.76 వద్ద ట్రేడయింది. బాలీవుడ్ నటి అతియా శెట్టి గంట మోగించి మూరత్ ట్రేడింగ్ను ప్రారంభించారు. మూరత్ ట్రేడింగ్లో సెన్సెక్స్ 195 పాయింట్లు, నిఫ్టీ 60 పాయింట్లు లాభపడ్డాయి. బీపీసీఎల్, ఐడీయా షేర్లు భారీగా జంప్ చేశాయి.
ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ 730 పాయింట్లు జంప్
బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 0.62 శాతం, 0.84 శాతం లాభపడ్డాయి. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.169.32 లక్షల కోట్లకు ఎగిసింది. నవంబర్ 13వ తేదీన మార్కెట్ ముగిసే సమయానికి రూ.168.33 లక్షల కోట్లుగా ఉంది. అంటే దాదాపు లక్ష కోట్లు ఎగిసింది.
బీఎస్ఈ, ఎన్ఎస్ఈ.. రెండూ హిందూ క్యాలెండర్ ఇయర్ సంవత్ 2076 ను మంచి లాభాలతో ముగించడంతో శుక్రవారం మార్కెట్ సానుకూలంగా ఉంది. నిఫ్టీ 29.15 పాయింట్లు(0.23 శాతం) ఎగిసి 12,719.95 వద్ద ముగిసింది. దీపావళి ముహూరత్ ట్రేడింగ్ సాయంత్రం గం.6 నుండి 6.08 మధ్య ఎనిమిది నిమిషాల ప్రీ-ఓపెన్ సెషన్ ట్రేడ్లో సెన్సెక్స్ 730 పాయింట్లు పెరిగింది. ముహూరత్ ట్రేడింగ్ సమయంలో 365 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ టాప్ 12,800ను తాకింది. సెన్సెక్స్ 43,800ను తాకింది.
మార్కెట్లకు సెలవు
దీపావళి బలిప్రతిపద సందర్భంగా సోమవారం మార్కెట్లకు సెలవు ఉంటుంది. ప్రతి సంవత్సరం . దీపావళి రోజున మొదలయ్యే కొత్త సంవత్సరానికి స్టాక్ మార్కెట్లు స్పెషల్ ట్రేడింగ్తో ఆహ్వానం పలుకుతాయి. దీంతో సంవత్ 2077 ప్రారంభ సందర్భంగా సాయంత్రం ఒక గంట పాటు ట్రేడింగ్ నిర్వహించారు. బీఎస్ఈలో 1957 నుండి దీపావళి సందర్భంగా ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తున్నారు. శుభముహూర్తం నేపథ్యంలో ట్రేడింగ్ ఒక పద్ధతిగా మారింది.