టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో 95%కు పైగా ఉద్యోగులు ఇంటి నుండే
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు అన్నీ వర్క్ ఫ్రమ్ హోం ఇచ్చాయి. ముఖ్యంగా ఐటీ రంగంలోని కంపెనీలకు చెందిన 90 శాతానికి పైగా ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలకు చెందిన 98 శాతం వరకు ఉద్యోగులు మార్చి 2021 వరకు వర్క్ ఫ్రమ్ హోం లేదా వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ చేయనున్నారు.
ప్రస్తుతం భారత్లో 99 శాతం మంది ఉద్యోగులు ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారని, జనవరి-మార్చి క్వార్టర్ వరకు పరిస్థితులు మారకపోవచ్చునని ఇన్ఫోసిస్ హెడ్ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో అన్నారు. 2021 ఏప్రిల్ తర్వాత అప్పటి కరోనా పరిస్థితులను బట్టి వర్క్ ఫ్రమ్ హోం లేదా కార్యాలయాలకు రప్పించడం ఉంటుందని తెలిపారు. తమకు ఉద్యోగుల భద్రత ముఖ్యమన్నారు.
కేవలం అవసరమైన ఉద్యోగులు మాత్రమే ట్రావెల్ చేస్తున్నారని, అలా ట్రావెల్ చేస్తున్నవారు కొంతమంది మాత్రమేనని చెప్పారు. అలాగే, 98 శాతం విప్రో ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నారు. జనవరి 2021 వరకు దీనిని పొడిగించారు. టీసీఎస్ ఉద్యోగుల్లో 97 శాతం మంది ఇంటి నుండి పని చేస్తున్నారు. వచ్చే అయిదేళ్లలో 25 శాతం మంది ఉద్యోగులను ఇంటి నుండి పని చేయిస్తామని టీసీఎస్ గతంలో ప్రకటించింది.