నరేంద్ర మోడీది అత్యాశేనా?: మరో దశాబ్దం సాధ్యంకాదన్న ప్రముఖ ఆర్థికవేత్త
2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల (రూ.350 లక్షల కోట్లు) ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఆర్థికవేత్తలు భిన్నంగా స్పందిస్తున్నారు. ప్రస్తుత జీడీపీతో సాధ్యం కాదని, కానీ వచ్చే ఏడాది నుంచి జీడీపీ పెరిగితే సాధ్యమని కొంతమంది అంటుంటే, మరికొంతమంది అసాధ్యమనే వారూ లేకపోలేదు. తాజాగా, మరో ఆర్థికవేత్త నాగరాజ్ ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు.
పెట్టుబడులు-ఉద్యోగాలు: ఇప్పుడు 'అమరావతి' పరిస్థితి ఏమిటి!?
ఈ దశాబ్దకాలంలో సాధ్యం కాకపోవచ్చు..
2024 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలబడాలంటే జీడీపీ వృద్ధి రేటు ప్రతి సంవత్సరం 9 శాతంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం మన జీడీపీ దాదాపు 2.8 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. ఇది రెట్టింపు అయితేనే కేంద్రం లక్ష్యం నెరవేరుతుందని, ఈ లక్ష్యం అసాధ్యం కాకపోయినా ఈ దశాబ్దకాలంలో మాత్రం సాధ్యం కాకపోవచ్చునని అన్నారు.
అత్యాశే అవుతుంది
వృద్ధి రేటు పడిపోతున్న ప్రస్తుత తరుణంలో మరో నాలుగేళ్లలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అత్యాశే అవుతుందన్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు సెప్టెంబర్ త్రైమాసికంలో 4.5 శాతానికి క్షీణించిందని గుర్తు చేశారు. అలాగే, పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల ధోరణి మారకపోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు.
వడ్డీ రేట్ల తగ్గుదల సాయపడలేదు
జీడీపీలో భారత ఎగుమతుల నిష్పత్తి 2010 నుంచి క్రమంగా క్షీణిస్తోందని, ఈ ధోరణి మారుతుందనే సంకేతాలు ఏమాత్రం కనిపించడం లేదని తెలిపారు. గత కొన్నేళ్లుగా తగ్గుతున్న వడ్డీ రేట్లు ఏ విధంగా సాయపడలేదని చెప్పారు. ద్రవ్య ప్రోత్సాహకాల అవసరం ఉందని తెలిపారు.
ఉద్దీపనలు అవసరం
వడ్డీ రేట్లు తగ్గించినా జీడీపీ పెరగలేదని చెప్పిన ఆయన, వచ్చే కేంద్ర బడ్జెట్లో మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకుంటే తప్ప ఆర్థిక వ్యవస్థ గాడిన పడే అవకాశం లేదని స్పష్టం చేశారు. రానున్న మూడు నాలుగేళ్లలో జీడీపీకి మరింత ఊతమిచ్చేలా బడ్జెట్ ఉంటుందని భావిస్తున్నామన్నారు. కాగా, ఆర్ నాగరాజ్ ఇందిరా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ (IGIDR)లో ఎకనమిక్స్ ప్రొఫెసర్గా ఉన్నారు.