లాభాల్లో మార్కెట్లు: సరికొత్త రికార్డులు సృష్టించిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 169 పాయింట్లు, నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో ప్రారంభించింది. కానీ సాయంత్రానికి అనూహ్యంగా పుంజుకొని సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఓ దశలో సెన్సెక్స్ 300 పాయింట్లు ఎగిసి 40,606 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్టానికి చేరుకుంది. నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 12,000 మార్క్ను తాకింది.
దాదాపు అన్ని ముఖ్య కంపెనీల షేర్లు పుంజుకోవడం, కేంద్ర ప్రభుత్వం మరిన్ని ఉద్దీపన చర్యలు చేపడుతుందనే సంకేతాల నేపథ్యంలో మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బ్యాంకింగ్, మెటల్, స్థిరాస్థి రంగాల షేర్ల అండతో మార్కెట్ ఝుమ్మంది. సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 222 పాయింట్ల లాభంతో 40,469 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల లాభంతో 11,961 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ, టాటా మోటార్స్ లాంటి దిగ్గజ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల అండతో నష్టాల నుంచి కోలుకున్న సూచీలు మధ్యాహ్నం సెషన్లో రికార్డ్ స్థాయిలో దూసుకెళ్లాయి. ఎన్ఎస్ఈలో సిప్లా, ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. టైటాన్, భారతీ ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి.