PM Modi: మోదీ 9 ఏళ్ల పాలనలో స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు లాభం ఎంతంటే..?
PM Modi: ప్రధానిగా మోదీ తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో దేశీయ స్టాక్ మార్కెట్ల పనితీరు ఎలా ఉంది. అసలు ఇన్వెస్టర్ల సంపద ఎంత మేర పెరిగింది వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా మహమ్మారి వంటి అనేక కారణాల మధ్య దలాల్ స్ట్రీట్ 9 ఏళ్ల ప్రయాణం గడిచింది. ఈ క్రమంలో ప్రధానిగా మోదీ రెండు పర్యాయాలు దేశానికి సేవలు అందించారు. ఈ కాలంలో నిఫ్టీ-50 సూచీ దాదాపు రెండు రెట్లు పెరిగింది. ఇదే క్రమంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ మూడు రెట్లు పెరిగి రూ.28 లక్షల కోట్లకు చేరుకుంది. అలాగే 2014-2023 మధ్య కాలంలో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారత ఈక్విటీల్లో 49.21 బిలియన్ డాలర్ల మేర నికర కొనుగోళ్లు జరిపారు.
ఇదే సమయంలో దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు 9 ఏళ్ల కాలంలో రూ.7 లక్షల కోట్లను కుమ్మరించారు. కేవలం 2020 సంవత్సరం మాత్రమే వారు నికర అమ్మకం దారులుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ కాలంలో కరోనా మహమ్మారి తెచ్చిన సవాళ్లను భారత్ అధిగమించి ముందుకు సాగుతున్న తరుణంలో.. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. అలాగే ద్రవ్యోల్బణాన్ని అదుపుచేసేందుకు చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయి.
వడ్డీ రేట్ల పెంపు గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, అధిక ఫ్రీక్వెన్సీ సూచికలు సానుకూలంగా ఉండటంతో.. మనీ మేనేజర్లు భారత ఈక్విటీ మార్కెట్పై బుల్లిష్గా ఉన్నారు. మోదీ హయాంలో ఇన్వెస్టర్లకు అత్యుత్తమ రాబడినిచ్చిన రంగాలను పరిశీలిస్తే.. IT అగ్రస్థానంలో నిలిచింది. తొమ్మిదేళ్ల కాలంలో నిఫ్టీ ఐటీ సూచీ ఏకంగా 219 శాతం పెరిగింది. ఈ జాబితాలో బ్యాంకులు, ఆర్థిక సేవలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 9 ఏళ్లలో నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 216%, బ్యాంక్ నిఫ్టీ 190% లాభపడ్డాయి.