ముఖేష్ అంబానీ దూకుడు: జియోలో KKR రూ.11,367 కోట్ల పెట్టుబడి, నెలలో ఐదో భారీ ఇన్వెస్ట్మెంట్
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్ఫాంలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈక్విటీ కంపెనీ KKR రూ.11,367 కోట్లతో 2.32 శాతం ఈక్విటీని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చింది. KKR ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి సంస్థ. గత నెల రోజుల్లో జియో ప్లాట్ఫాంలో వివిధ అగ్రశ్రేణి కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి. ఫేస్బుక్, సిల్వర్ లేక్, విస్తా, జనరల్ అట్లాంటింక్, ఇప్పుడు KKR కలిపి మొత్తం పెట్టుబడుల వ్యాల్యూ రూ.78,562 కోట్లకు చేరుకుంది. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి రుణరహిత కంపెనీగా రిలయన్స్ను నిలపాలని ముఖేష్ అంబానీ భావిస్తున్నారు.
జియో మార్ట్ వాట్సాప్ సేవలు ప్రారంభం: ఎక్కడ, ఎలా ఆర్డర్ చేయాలి?
వరుసగా ఐదో అతి పెద్ద పెట్టుబడి
జియో ప్లాట్ఫామ్స్లో KKR రూ.11,367 కోట్లు పెట్టుబడితో 2.32 శాతం వాటాను దక్కించుకోనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఓ ప్రకటనలో తెలిపింది. రిలయన్స్కు నెల రోజుల్లో ఇది ఐదో అతి పెద్ద పెట్టుబడి. గత నాలుగు వారాల్లోనే రూ.67,000 కోట్లకు పైగా నిధులు పెట్టుబడుల ద్వారా సమీకరించింది. దీంతో కలిపి రూ.78వేల కోట్లకు పైగా చేరుకున్నాయి. ఈక్విటీ వ్యాల్యూ రూ.4.91 లక్షల కోట్లు, ఎంటర్ప్రైజెస్ వ్యాల్యూ రూ.5.16 లక్షల కోట్ల వద్ద ఈ వాటాలు కొనుగోలు చేస్తోంది.
పెట్టుబడుల వరద ఇలా...
గత నెల రోజుల్లో జియో ప్లాట్ ఫామ్స్లోకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. తొలుత జియో-ఫేస్బుక్ మధ్య రూ.43,574 కోట్ల డీల్ కుదిరింది. ఈ పెట్టుబడితో ఫేస్బుక్ 9.99 శాతం వాటాను దక్కించుకుంది. ఆ తర్వాత అమెరికా ప్రయివేటు ఈక్విటీ దిగ్గజం సిల్వర్ లేక్ పార్ట్నర్స్.. జియో ప్లాట్ఫామ్స్లో 1% వాటాను రూ.5,655 కోట్లకు కొనుగోలు చేసింది. అనంతరం విస్తా ఈక్విటీ రూ.11,367 కోట్ల విలువైన 2.3 శాతం వాటాను దక్కించుకుంది. అనంతరం జనరల్ అట్లాంటిక్ పార్ట్నర్స్ రూ.6,598.38 కోట్ల పెట్టుబడితో 1.34 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఇప్పుడు కేకేఆర్ రూ.11,367 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చింది.
డిజిటల్ సొసైటీగా మార్చే లక్ష్యంలో భాగంగా..
ప్రీమియర్ డిజిటల్ సొసైటీగా ఇండియాను నిర్మించాలనే తమ లక్ష్యంలో KKR పాలుపంచుకుంటోందని, ఇందులో భాగంగా షేర్లు కొనుగోలు చేసిందని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. కేకేఆర్ విలువైన భాగస్వామి అని నిరూపితమైందని, మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, చాలా ఏళ్లుగా భారత దేశ వృద్ధికి కట్టుబడి ఉందని చెప్పారు.
1976లో ప్రా4రంభమైన KKR
KKR 1976లో స్థాపించబడింది. ఈ సంస్థ ఇప్పటి వరకు టెక్ కంపెనీల్లో 30 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. సంస్థ పోర్ట్పోలియోలో టెక్నాలజీ, మీడియా, టెలికం రంగాలకు చెందిన 20 కంపెనీల వరకు ఉన్నాయి. KKR 2006 నుండి మన దేశంలో పెట్టుబడులు పెడుతోంది. ఈ కంపెనీకి భారత్ వ్యూహాత్మక మార్కెట్గా పేర్కొంది. ఈ సంస్థ ఆసియా ప్రయివేటు ఈక్విటీ, గ్రోత్ టెక్నాలజీ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేస్తోంది. KKR కో-ఫౌండర్, కో-సీఈవో హెన్రీ క్రావిస్ మాట్లాడుతూ... ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, బలమైన నాయకత్వం బృందంలో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపారు.