ఇక బెంగళూరులో ఈ-బైక్ ట్యాక్సీలు, ప్రభుత్వం కీలక నిర్ణయం
కర్ణాటక ప్రభుత్వం సరికొత్త ఈవీ పాలసీని ప్రకటించింది. ఎలక్ట్రికల్ బైక్ ట్యాక్సీని రోడ్లపై పరిమిత దూరంలో అనుమతించే విధానాన్ని ప్రకటించింది. ఈ కొత్త పాలసీని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. 'కర్నాటక ఎలక్ట్రిక్ బైక్ ట్యాక్సీ పథకం 2021ను ఈ రోజు విడుదల చేసింది. ఈ కొత్త విధానం జీవన సౌలభ్యాన్ని పెంచుతుంది. అర్బన్ మొబిలిటీలో స్వయం ఉపాధి, వ్యవస్థాపక అవకాశాలను సృష్టిస్తుంది' అని యెడ్యూరప్ప ఓ ట్వీట్లో తెలిపారు.
ఎలక్ట్రిక్ బైక్స్ కోసం కొత్త విధానం ప్రకారం సంస్థలు లేదా వ్యక్తులు తమ ఈ-బైక్స్ను ట్యాక్సీలుగా నమోదు చేసుకోగలుగుతారు. అయితే ఈ-బైక్ ట్యాక్సీ అనుమతిని పొందడానికి బైక్స్లో 'బైక్ ట్యాక్సీ' అనే పదాలను స్పష్టంగా పేర్కొనవలసి ఉంటుంది. దీంతో పాటు ఈ-బైక్ ట్యాక్సీ కంపెనీలు రైడర్, యజమానికి ఇన్సురెన్స్ కవరేజీని అందించాలి.
కర్ణాటక ప్రభుత్వం ఈ నిర్ణయం స్వాగతించదగ్గదని, ప్రశంసనీయమని ర్యాపిడో కో-ఫౌండర్ అరవింద్ శంక అన్నారు. ఇది చాలా కాలంగా ఎదురు చూస్తోన్న అంశమని, ఇది సరైన నిర్ణయమన్నారు. ఇది అందరికీ ఎంతో ప్రయోజనకరమన్నారు. మరో విషయం గుర్తించాలని, బెంగళూరులో ఎక్కువగా ఇంధన ఆధారిత టూ-వీలర్స్ ఉన్నాయని, తాజా నిర్ణయం బెంగళూరు ట్రాఫిక్ను కాస్త తగ్గించవచ్చునని, అలాగే కరోనా సమయంలో ఆర్థిక భారం తగ్గడానికి ఉపయోపడుతుందన్నారు.