అదరగొట్టిన జున్జున్వాలా కంపెనీ.. షేర్లు కొనేందుకు ఎగబడతున్న ఇన్వెస్టర్లు
Rakesh Jhunjhunwala: దివంగత స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ రాకేష్ జున్జున్వాలా లేనప్పటికీ ఆయన మార్గంలో చాలా మంది ఇన్వెస్టర్లు ముందుకు సాగుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కంపెనీ మరోసారి వార్తల్లో నిలిచింది.
త్రైమాసిక ఫలితాలు..
డిసెంబర్ త్రైమాసికంలో జున్జున్వాలా కంపెనీ మంచి లాభాలను నమోదు చేసింది. ఫలితం విడుదలైన తర్వాత షేర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో బుధవారం నజారా టెక్నాలజీస్ షేర్ ధర 6.5 శాతం పెరిగింది. దీంతో స్టాక్ ధర రూ.651కి చేరుకుంది. డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 31 శాతం మేర పెరిగింది.
ఈసారి లాభాలు..
క్యూ-3లో కంపెనీ నికర లాభం రూ.22.4 కోట్లుగా నమోదైంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.17.1 కోట్లుగా ఉంది. అలాగే ప్రస్తుత సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.314.80 కోట్లుగా ఉంది. కంపెనీ ఆదాయం గత సంవత్సరం ఇదే కాలంలో రూ.185.80 కోట్లుగా ఉంది. అంటే గత సంవత్సరం కంటే ఈ సారి మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం దాదాపు 70 శాతం మేర పెరిగింది.
స్టాక్ పనితీరు..
నజారా టెక్నాలజీస్ స్టాక్ గత నెలలో 12 శాతానికి పైగా లాభపడ్డాయి. అలాగే ఆరు నెలల కాలాన్ని చూసినట్లయితే ఇన్వెస్టర్లకు 14 శాతం రాబడి లభించింది. కంపెనీ 52 వారాల స్టాక్ గరిష్ఠ ధర రూ.1188 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.475.05గా ఉంది. అయితే ఎన్ఎస్ఈలో స్టాక్ ధర ఈ రోజు రూ.610 వద్ద ముగిసింది.
ఈ ఉదయం స్టాక్ రూ.625.20 వద్ద బీఎస్ఈలో ట్రేడింగ్ మెుదలెట్టినప్పటికీ.. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో స్టాక్ అత్యధికంగా రూ.651 మార్కును చేరుకుంది. అలాగే అత్యల్పంగా రూ.598.40 స్థాయిని తాకి చివరికి రూ.606.10 వద్ద స్థిరపడింది.
రేఖా జున్జున్వాలా..
డిసెంబర్ త్రైమాసికం నాటికి కంపెనీలో జున్జున్వాలాకు మొత్తం 10 శాతం వాటా ఉంది. అంటే వారికి కంపెనీలో 65,88,620 షేర్లు ఉన్నాయి. అదే సమయంలో ప్రమోటర్లు ఇద్దరూ కలిసి 19.1 శాతం వాటాను కలిగి ఉన్నారు.