'అలీబాబా' జాక్మా సహా భారీగా పెరిగిన చైనా కుబేరుల సంపద: 50% పైగా ఆదాయం జంప్
కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా కుబేరుల సంపద మరింతగా పెరిగింది. మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ నుండి జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ వరకు చాలామంది సంపద రెండింతలు కూడా పెరిగింది. ముఖ్యంగా టెక్ దిగ్గజాలకు కలిసి వచ్చింది. చైనా టెక్ పారిశ్రామికవేత్తల సంపద కూడా కరోనా సమయంలో ఎగిసింది. ఆన్లైన్ షాపింగ్ వంటివి పెరగడంతో ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా వ్యవస్థాపకులు జాక్ మా సంపద పెరిగింది. హూరున్ రీసెర్చ్ ప్రకారం జాక్ మా సంపద 2019తో పోలిస్తే 45 శాతం పెరిగి 58.8 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మన కరెన్సీలో ఇది రూ.4.4 లక్షల కోట్లు.
గూగుల్ బాటలోనే.. ఉద్యోగుల ఆరోగ్యం కోసం అమెజాన్ కీలక నిర్ణయం
అలీబాబా సహా టాప్ 3 వీరే..
ఈ జాబితాలో అలీబాబా తర్వాత రెండో స్థానంలో వీచాట్ మేనేజింగ్ సర్వీస్ నిర్వహించే టెన్సెంట్ వ్యవస్థాపకులు మా హుటెంగ్ 57.4 బిలియన్ డాలర్లతో ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే అతని సంపద 50 శాతం పెరిగింది. బాటిల్డ్ వాటర్ బ్రాండ్ నాంగ్పూ స్ప్రింగ్ చైర్మన్ జోంగ్ షన్షాన్ సంపద 53.7 బిలియన్ డాలర్లకు పెరిగి మూడో స్థానంలో ఉన్నారు. సెప్టెంబర్ మాసంలో ఈ కంపెనీ లిస్ట్ అయింది. దీంతో ఆయన సంపద భారీగా పెరిగింది.
పెరిగిన చైనా పారిశ్రామికవేత్తల సంపద
కరోనా మహమ్మారి నేపథ్యంలో షేర్ ధరల పెరుగుదల కారణంగా సగటున ఐదుగురు చైనా పారిశ్రామికవేత్తల సంపద గత ఏడాది కంటే భారీగా పెరిగిందని హురున్ ఫౌండ్ రుపెర్ట్ హూగ్వర్ఫ్ తెలిపారు. ఈ ఏడాది ప్రతి వారం 1 బిలియన్ డాలర్ల మేర పెరిగింది. చైనా కుబేరుల జాబితాలో రియల్ ఎస్టేట్ సంస్థ కంట్రీ గార్డెన్ యజమానురాలు యాంగ్ హ్యూయాన్ కూడా చోటు దక్కించుకొని ధనిక మహిళగా నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే ఈమె సంపద 29 శాతం పెరిగి 33 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
జూమ్ యాప్ ఓనర్ ఎరిక్ యువాన్ సంపద 10 బిలియన్ డాలర్లు పెరిగి 16.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఆఫ్సిన్ అధిపతి సంపద రెండింతలు పెరిగి 20.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.
చైనా మాత్రమే పాజిటివ్గా...
కరోనా సమయంలో చాలామంది పారిశ్రామికవేత్తలు లాభాలు చూశారు. 257 మంది చైనా వాణిజ్యవేత్తలు బిలియనీర్ల జాబితాలో చేరారు. కరోనా సమయంలో ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్, జర్మనీ కెనడా, ఫ్రాన్స్, యూకే దేశాల జీడీపీ భారీగా పతనం కాగా, చైనా వృద్ధి మాత్రం పాజిటివ్గా ఉంది.