ఐపీవోలు అదుర్స్: 30 కంపెనీలు సమీకరించింది రూ.31,000 కోట్లకు పైగా
అంతర్జాతీయ నిధుల లభ్యతకు తోడు, డొమెస్టిక్ ఈక్విటీ మార్కెట్లో బుల్ రన్ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయ కంపెనీలు IPOల ద్వారా రూ.31 వేల కోట్లకు పైగా నిధులను సమీకరించాయి. సెకండరీ మార్కెట్లో సెంటిమెంట్ బాగుండటం, ప్రైమరీ మార్కెట్కు మద్దతుగా నిలిచింది. 2021-22లోను పబ్లిక్ ఇష్యూలు వరుస పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెబి వద్ద ఐపీవో అనుమతుల కోసం 28 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. వీటి ద్వారా రూ.28,710 కోట్లు సమీకరించే లక్ష్యంతో ఉన్నాయని చెబుతున్నారు.
ఐపీవో ద్వారా సమీకరణ
FY22లో లైఫ్ ఇన్సురెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(LIC), హెచ్డీబీ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎన్డీఈఎక్స్, ఈఎస్ఏఎఫ్ స్మాల్ పైనాన్స్ బ్యాంకుల ఐపీవోలు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలో వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. 2020-21లో ఐపీవోలే కాకుండా యస్ బ్యాంకు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా రూ.15వేల కోట్లు సమీకరించింది.
2017-18లో రూ.82,109 కోట్లు, 2018-19లో రూ.14,719 కోట్లు, 2019-20లో రూ.20,352 కోట్లు, 2020-21లో రూ.31,277 కోట్లు సమీకరించాయి. FY18లో 45 కంపెనీలు, FY19లో 14 కంపెనీలు, FY20లో 13 కంపెనీలు, FY21లో 30 ఐపీవోలు వచ్చాయి.
ఐపీవోకు స్పందన అదుర్స్
FY21లో భిన్న రంగాల నుండి ఐపీవోకు వచ్చాయి. గోల్డ్ అండ్ జ్యువెల్లరీ, స్పెషాల్టీ కెమికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సెక్టార్ల నుండి వచ్చాయి. ఫిక్స్డ్ డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు దశాబ్దాల కనిష్టానికి పడిపోవడం కూడా ఇన్వెస్టర్లను ఈక్విటీల వైపు ఆకర్షించాయి. ఎంటార్ టెక్నాలజీస్ ఐపీవోకు రెండువందల రెట్ల స్పందన వచ్చింది. బర్గర్ కింగ్, ఈజీ ట్రిప్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్ వంటి ఐపీవోలకు వంద రెట్ల స్పందన లభించింది.
హైదరాబాద్ కంపెనీయే ఎక్కువ
FY21లో వచ్చిన ఐపీవోల్లో చాలా కంపెనీలు మంచి లిస్టింగ్ లాభాలు నమోదు చేశాయి. రూట్ మొబైల్, రోజరీ బయోటెక్, బర్గర్ కింగ్ ఇండియా వంటివి 84 శాతం నుండి 300 శాతానికి పైగా లాభాలను తెచ్చాయి. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే గ్లాండ్ ఫార్మా ఒక్కటే రూ.6480 కోట్లను సమీకరించింది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పోరేషన్ రూ.4633 కోట్లు సమీకరించింది.