ఒక్కరోజులో రూ.2.81 లక్షల కోట్లు వెనక్కి, పడి'లేచిన' లక్ష్మీవిలాస్
ముంబై: స్టాక్ మార్కెట్లు వరుసగా రెండు రోజులు భారీ లాభాల్లో ముగిశాయి. చివరి సెషన్ (శుక్రవారం)లో 800 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్, ఈరోజు దాదాపు 600 పాయింట్ల వరకు లాభపడింది. రెండు రోజుల్లో 1,428 పాయింట్ల మేర ఎగిసింది. అంతకుముందు 6 సెషన్లలో సెన్సెక్స్ 2750 పాయింట్లు నష్టపోయింది. ఆరు సెషన్లలో ఇన్వెస్టర్లు రూ.11 లక్షల కోట్లకు పైగా నష్టపోయారు. అయితే ఈ రెండు రోజుల్లో సగాని కంటే ఎక్కువ లాభం చేకూరింది. వరుసగా రెండు రోజులు భారీ లాభాలు రావడంతో ఇన్వెస్టర్లు మురిసిపోతున్నారు. మొన్న ఐటీ స్టాక్స్, రిలయన్స్, ఆటో వంటివి దోహదపడితే, ఈ రోజు ఆటో, బ్యాంకింగ్, మెటల్ రంగాలు చేయూతనిచ్చాయి.
మార్కెట్ జోరు: రిలయన్స్, బ్యాంకులు లాభాలు తెచ్చాయి!
రూ.2.81 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద
అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ఉండటం, కరోనా రికవరీలు పెరగడంతో పాటు చైనా ఇండస్ట్రియల్ వరుసగా నాలుగో నెల వృద్ధిని నమోదు చేశాయి. చైనా ఇండస్ట్రియల్ ప్రాఫిట్ ఆగస్ట్ నెలలో 19.1 శాతం నమోదయింది. ఇది కూడా మన ఆసియాతో పాటు మన మార్కెట్ పైన ప్రభావం చూపింది. 30 షేర్ ప్యాక్ సెన్సెక్స్ 593 పాయింట్లు లాభపడటంతో ఇన్వెస్టర్ల సంపద ఈ రోజు 2.81 లక్షల కోట్లు పెరిగింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.155.09 లక్షల కోట్లకు చేరుకుంది.
ప్యాకేజీకి రెడీ..
ఓవైపు అమెరికా కాంగ్రెస్ కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతూనే, ప్యాకేజీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దేశీయంగా కూడా ప్రభుత్వం ప్యాకేజీ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. పీఎస్యూ బ్యాంకులకు కేంద్రం రూ.20 వేల కోట్ల తాజా పెట్టుబడులను సమకూర్చనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో మొన్న మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభపడ్డాయి.
శుక్రవారం FPIలు రూ.2,080 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించగా, దేశీ ఫండ్స్ DIIలు రూ.2,071 కోట్లను ఇన్వెస్ట్ చేశాయి.
లక్ష్మీ విలాస్ బ్యాంకు అదుర్స్
లక్ష్మీ విలాస్ బ్యాంకులో సంక్షోభం నేపథ్యంలో ఉదయం బ్యాంకు షేర్లు ఆరు శాతం మేర నష్టపోయాయి. ఆ తర్వాత ఆర్బీఐ జోక్యం చేసుకోవడంతో కుదురుకున్నది. సీఈవో, డైరెక్టర్లను తప్పించింది. ఆర్బీఐ డైరెక్టర్లను నియమించింది. దీంతో మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ ఐదు శాతం మేర లాభపడ్డాయి. కాగా, ఆర్బీఐ ఎంపీసీ మీటింగ్ను పోస్ట్ పోన్ చేసింది. కొత్త తేదీలను త్వరలో ప్రకటించనుంది.