ఒక్కరోజులో రూ.7 లక్షల కోట్ల సంపద హుష్కాకి, ఎల్ఐసీ స్టాక్ మరింత డౌన్
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం (మే 19) భారీ నష్టాల్లో ముగిశాయి. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు ఒక్కరోజే రూ.7 లక్షల కోట్లు తగ్గింది. సెన్సెక్స్ ఏకంగా 1416 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 431 పాయింట్లు క్షీణించింది. దాదాపు అన్ని రంగాలు కూడా 3 శాతం మేర పడిపోయాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీ 2 శాతం, స్మాల్ క్యాప్ 100 సూచీ 1 శాతం క్షీణించాయి.
విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు ప్రతికూల ధోరణిలో ఉండటంతో భారీ ఎత్తున పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. మే నెలలోనే ఇప్పటి వరకు రూ.38 వేల కోట్ల విలువైన పొజిషన్లను విక్రయించారు. భవిష్యత్తులో సూచీలు మరింత క్షీణించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఫెడ్ వడ్డీ రేటు సహా వివిధ కేంద్ర బ్యాంకుల వడ్డీ రేటు ప్రభావం కూడా ఉంటుంది.
బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రితం సెషన్లో రూ.255.7 లక్షల కోట్లు కాగా, నేడు రూ.249.17 లక్షల కోట్లకు పడిపోయింది. ఇక, ఇటీవలే ఐపీవోకు వచ్చిన ఎల్ఐసీ షేర్ వ్యాల్యూ నేడు మరో 4 శాతం పడిపోయింది. ఈ రోజు రూ.840.20 వద్ద ముగిసింది.
అమెరికా మార్కెట్లు గత రెండేళ్లలో ఎన్నడూ లేని పతనాన్ని చూశాయి. అమెరికా మార్కెట్లలో కూడా మాంద్యం భయాలు కనిపించాయి. ఫెడ్ ద్రవ్య పరపతి విధానం మరింత కఠినతరం కానుందనే వార్తలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. రష్యా - ఉక్రెయిన్ యుద్ధం ద్రవ్యోల్భణ ఆందోళనలను ఎప్పటికప్పుడు రెట్టింపు చేస్తోంది. అమెరికాలో వినిమయ వస్తువుల ధరలు 8.2 శాతం పెరగగా, ఇది నలభై ఏళ్ల గరిష్టం.