నిమిషానికి రూ.860 కోట్ల సంపద ఆవిరి, లిస్టింగ్ రోజే ఆ కంపెనీకి షాక్
ముంబై: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, లాక్ డౌన్ భయలు స్టాక్ మార్కెట్లను వణికించాయి. ఆర్థిక రికవరీపై ఆందోళనతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగారు. దీంతో నిన్న (బుధవారం, మార్చి 24) సెన్సెక్స్ 871 పాయింట్లు క్షీణించి 49,180 పాయింట్ల వద్ద, నిఫ్టీ 265 పాయింట్లు క్షీణించి 14,549 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ తర్వాత సూచీలకు అతిపెద్ద పతనం ఇదే. కరోనా సెకండ్ వేవ్ భయానికి తోడు అంతర్జాతీయ మార్కెట్ నుండి అందిన బలహీన సంకేతాలు ఇన్వెస్టర్ల సెంటుమెంటును దెబ్బతీశాయి. డాలర్ మారకంతో రూపాయి 12 పైసలు క్షీణించి 72.55 వద్ద క్లోజ్ అయింది.
ఒక్కరోజు రూ.3.27 లక్షల కోట్లు ఆవిరి
సూచీలు భారీగా నష్టపోవడంతో ఇన్వెస్టర్ల సంపద నిన్న ఒక్కరోజే రూ.3.27 లక్షల కోట్లు ఆవిరైంది. దీంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే లిస్టెడ్ సంస్థల మొత్తం మార్కెట్ వ్యాల్యూ రూ.202.48 లక్షల కోట్లకు పరిమితమైంది. నిమిషానికి రూ.875 కోట్ల చొప్పున హరించుకుపోయింది. మొత్తం 375 నిమిషాల్లో రూ.3.27 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. అంటే నిమిషానికి రూ.875 కోట్లు.
లిస్టెడ్ కంపెనీల నేలచూపులు
సెనెక్స్ 30 లిస్టెడ్ కంపెనీల్లో ఏషియన్ పెయింట్స్, పవర్ గ్రిడ్ మినహా మిగతా 28 స్టాక్స్ నష్టపోయాయి. మహీంద్రా అండ్ మహీంద్రా 3.97 శాతం నష్టంతో టాప్ లూజర్గా నిలిచింది. ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్ 3 శాతానికి పైగా నష్టపోగా, ఐటీసీ, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ స్టాక్ రెండు శాతానికి పైగా నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 1.60 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 1.79 శాతం పతనమైంది. రంగాలవారీగా చూస్తే రియాల్టీ, మెటల్, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటో, క్యాపిటల్ గూడ్స్ భారీగా నష్టపోయాయి.
మొదటి రోజే ఆ కంపెనీకి షాక్
బీఎస్ఈలో 2115 షేర్లు నష్టాల్లో ముగియగా, 842 లాభపడ్డాయి. 167 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. స్పెషాలిటీ రసాయనాల సంస్థ అనుపమ్ రసాయన్ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయిన మొదటి రోజే నష్టాలు మూటగట్టుకుంది. ఇష్యూ ధర రూ.555తో పోలిస్తే బీఎస్ఈలో 3.65 శాతం తక్కువగా రూ.534.70 వద్ద్ నమోదయింది. ఇంట్రాడేలో ఓ సమయంలో దాదాపు పది శాతం నష్టపోయి రూ.501 వద్ద కనిష్టాన్ని తాకి, చివరకు 5.24 శాతం క్షీణించి రూ.525.90 వద్ద ముగిసింది.