ఒక్కరోజులో రూ.1.4 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి, కారణమిదే
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ముగిశాయి. నిన్న ఉదయం లాభాల్లో ప్రారంభమైనప్పటికీ, సాయంత్రానికి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 51,660.98 పాయింట్ల వద్ద ప్రారంభమై, 51,821.84 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 50,538.43 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకి, చివరకు 487.43 (0.95%) పాయింట్లు నష్టపోయి 50,792 పాయింట్ల వద్ద, నిఫ్టీ 143.85 (0.95%) పాయింట్లు కోల్పోయి 15,030 పాయింట్ల వద్ద ముగిసింది. ఓ సమయంలో సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు.
రూ.1.42 లక్షలక్షల కోట్లు పతనం
శుక్రవారం మార్కెట్లు నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్లు రూ.1.42 లక్షల కోట్ల మేర కోల్పోయారు. నిన్నటితో మూడు రోజుల వరుస లాభాలకు అడ్డుకట్టపడింది. బ్యాంకింగ్, వాహన షేర్ల డీలాతో సూచీలు శుక్రవారం నష్టాలు మూటకట్టుకున్నాయి. సూచీల్లో కీలకమైన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ అమ్మకాల ఒత్తిడికి లోను కావడం కూడా దోహదపడింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లేవు. దీంతో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. మార్కెట్ నష్టాలతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1,37,590.62 కోట్లు తగ్గి రూ.2,07,89,062.84 కోట్లకు పరిమితమైంది.
డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ 12 పైసలు పెరిగి 72.79 వద్ద ముగిసింది.
ఈ షేర్లు జంప్
సెన్సెక్స్ 30 షేర్లలో అయిదు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగతావి నష్టాల్లో ముగిశాయి. పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.28%, టైటాన్ 0.76%, ONGC 0.52%, ఇన్ఫోసిస్] 0.38% షేర్లు లాభపడ్డాయి. బజాజ్ ఆటో 3.10%, రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.97%, మారుతీ సుజుకీ 2.4%, ఐసీఐసీఐ బ్యాంక్ 2.4%, సన్ ఫార్మా 2.04%, అల్ట్రాటెక్ సిమెంట్ 1.88% డీలాపడ్డాయి.
ప్రాఫిట్ బుకింగ్
ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక పొజిషన్లను తగ్గించుకోవడంతో పాటు ప్రాఫిట్ బుకింగ్కు దిగారని, దీంతో సూచీలు నేల చూపులు చూశాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. బాండ్ ఈల్డ్స్ తిరిగి పుంజుకోవడంతో బ్యాంకింగ్ రంగ షేర్లు నష్టాలను చవి చూశాయంటున్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దేశీయ మార్కెట్లో స్వల్పకాలం పాటు అస్థిరత కొనసాగే అవకాశముందని అంటున్నారు.