బడ్జెట్ దెబ్బ:భారీ నష్టాల్లో మార్కెట్లు, సెన్సెక్స్ 1000పాయింట్ల డౌన్, రూ.4లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ మార్కెట్లకు రుచించలేదు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో దాదాపు అన్ని రంగాలు కూడా మోడీ ప్రభుత్వం రెండోసారి వచ్చాక ప్రవేశ పెట్టిన ఈ పూర్తి బడ్జెట్ పైన కోటి ఆశలు పెట్టుకుంది. బడ్జెట్ సామాన్యులకు అనుకూలంగా ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే మార్కెట్లకు మాత్రం ఇది రుచించలేదు. మార్కెట్లు శనివారం భారీ నష్టాల్లో ముగిశాయి. అన్ని రంగాల షేర్లు కూడా నష్టపోయాయి.
Budget 2020: ఆదాయాలు పెంపు, ప్రజలకు 4 శాతం ఆదా
దాదాపు 1000 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
మార్కెట్ క్లోజింగ్ సమయానికి సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు నష్టపోయింది. అక్షరాలు 988 పాయింట్లు (2.43 శాతం) నష్టపోయి 39,735.53 వద్ద నిలిచింది. చాలా రోజుల తర్వాత 40వేల మార్క్ దిగువకు సెన్సెక్స్ క్లోజ్ అయింది.
నిఫ్టీదీ అదే దారి
మార్కెట్ క్లోజింగ్ సమయానికి నిఫ్టీ కూడా భారీ నష్టాలతో ముగిసింది. ఏకంగా 373.95 (3.11%) పాయింట్లు నష్టపోయి 11,661.85 వద్ద క్లోజ్ అయింది. కొంతకాలంగా 12,000 మార్క్ పైకి ట్రేడ్ అవుతున్న నిఫ్టీ ఇప్పుడు ఆ మార్క్ కంటే 300కు పైగా పాయింట్లకు దిగువన పడిపోయింది.
భారీగా నష్టపోయిన స్టాక్స్
ITC, Tata Motors, HDFC and Larsen & Toubro తదితర షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్కో షేర్ ధర దాదాపు 6 శాతం వరకు నష్టపోయింది. లాభాల్లో ట్రేడింగ్ ముగించిన మార్కెట్లలో SBI, రిలయన్స్ ఇండస్ట్రీస్, IRCTC, మారుతీ సుజుకి ఉన్నాయి. 616 షేర్లు లాభాల్లో, 1689 షేర్లు నష్టాల్లో ఉండగా, 120 షేర్లలో మార్పు లేదు.
టాప్ లూజర్స్, టాప్ గెయినర్స్ ఇవే...
టాప్ లూజర్స్ జాబితాలో ఐటీసీ, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ, జీ ఎంటర్టైన్మెంట్, లార్సన్ ఉన్నాయి. టాప్ గెయినర్స్లో టీసీఎస్, హిందూస్తాన్ యూనీలీవర్, టెక్ మహీంద్రా, నెస్ట్లే, ఇన్ఫోసిస్ ఉన్నాయి. మోస్ట్ యాక్టివ్ షేర్లలో ఎస్బీఐ, రిలయన్స్, మారుతీ సుజుకీ, లార్సన్, ఐటీసీ ఉన్నాయి.
రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరి
నిర్మలమ్మ బడ్జెట్ మార్కెట్లలో ఉత్తేజాన్ని నింపలేకపోయింది. దీంతో సెన్సెక్స్ దాదాపు వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్ల నష్టంతో ముగిసింది. దీని వల్ల ఈ ఒక్కరోజే మార్కెట్లోని రూ.4 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. తద్వారా బడ్జెట్కు మార్కెట్లు వరస్ట్గా ప్రతిస్పందించాయి.