బ్యాంకులో డిపాజిట్లపై శుభవార్త, బీమా కవరేజీని రూ.1 లక్ష నుంచి మరింత పెంపు
బ్యాంకుల్లో డిపాజిట్ చేసే కస్టమర్లకు శుభవార్త. వారికి మరింత భరోసా లభించనుంది. ప్రస్తుతం బ్యాంకు డిపాజిట్లపై అమలులో ఉన్న రూ.1 లక్ష బీమా కవరేజీని పెంచే అవకాశమున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రెండు రోజుల క్రితం మీడియా సమావేశంలో చెప్పారు. మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంకుల నియంత్రణకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. ఈ రెండింటికీ సంబంధించి పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టాల్ని తీసుకు వస్తామని చెప్పారు.
ఇటీవల పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు స్కాం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బ్యాంకు డిపాజిటర్లు జమ చేసే మొత్తాలపై డిపాజిట్ ఇన్సురెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ రూ.1 లక్ష వరకు బీమా కవరేజీని అందిస్తోంది. 1993 నుంచి డిపాజిట్ ఇన్సురెన్స్ రూ.1 లక్ష వరకు కల్పిస్తున్నారు. దీంతో పీఎంసీ డిపాజిటర్లు పెద్ద మొత్తంలో నష్టపోయారు. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. త్వరలో చట్టాన్ని తీసుకు వస్తామని నిర్మల తెలిపారు.
అలాగే సహాకార బ్యాంకుల సంక్షోభాల్ని కట్టడి చేసేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాల్ని విడుదల చేస్తామన్నారు. ఇప్పటికే బిల్లు రూపకల్పన జరిగిందని, క్యాబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంటులో ప్రవేశపెట్టి అమలులోకి తీసుకు వస్తామన్నారు. పీఎంసీ బ్యాంక్లో జరిగిన మోసాలు మళ్లీ జరుగకూడదనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న బ్యాంకుల మార్గదర్శకాలను మార్చి నూతన ప్రణాళికను ప్రకటించనున్నట్లు అభిప్రాయపడ్డారు.
అదే విధంగా సంక్షేమ పథకాలపై వ్యయాలను తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆమె స్పష్టం చేశారు. టెలికం రంగంలోని ఆర్థిక ఇబ్బందులపై ఆమె స్పందిస్తూ... ఏ కంపెనీ కూడా కార్యకలాపాలు క్లోజ్ చేయాలని తాము కోరుకోవడం లేదని, ప్రతి ఒక్కరు ఎదగాలన్నారు.