Infosys: ఇన్ఫోసిస్కు షాక్.. రాజీనామా చేసిన ప్రెసిడెంట్ మోహిత్ జోషి..
ఇన్ఫోసిస్ లో కీలక ఉద్యోగి రాజీనామా చేశారు. సంస్థ ప్రెసిడెంట్ మోహిత్ జోషి తన పదవికి రాజీనామా చేశారు. అతను టెక్ మహీంద్రాలో చేరడానికి కంపెనీకి రాజీనామా చేసినట్లు రెండు సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలియజేశాయి. మోహిత్ జోషి 2000 నుంచి ఇన్ఫోసిస్లో పని చేస్తున్నారు. తాజాగా మోహిత్ జోషి టెక్ మహీంద్రాలో మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులయ్యారు.
ఫైనాన్షియల్ సర్వీసెస్
మోహిత్ జోషి మార్చి 11 నుంచి సెలవులో ఉంటారని, కంపెనీలో అతను పని చేసే చివరి తేదీ జూన్ 9, 2023 అని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కి ఒక ప్రకటనలో ఇన్ఫోసిస్ తెలిపింది. మోహిత్ జోషి ఇన్ఫోసిస్ లో ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్కేర్/లైఫ్ సైన్సెస్ బిజినెస్కు నేతృత్వం విహించారు. అతను ఎడ్జ్వెర్వ్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్గా కూడా ఉన్నాడు. గ్లోబల్ బ్యాంకింగ్ ప్లాట్ఫారమ్, ఫినాకిల్ను కలిగి ఉన్న సంస్థ సాఫ్ట్వేర్ వ్యాపారానికి నాయకత్వం వహించాడు.
ఢిల్లీ యూనివర్శిటీ
మోహిత్ జోషి 2014లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో గ్లోబల్ యంగ్ లీడర్ ప్రోగ్రామ్కు ఆహ్వానితులుగా వెళ్లారు. అతను బ్రిటిష్ ఇండస్ట్రీ ఎకనామిక్ గ్రోత్ బోర్డ్ ఆఫ్ కాన్ఫెడరేషన్ వైస్ ఛైర్, యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్ సభ్యుడిగా కూడా ఉన్నారు. ఢిల్లీ యూనివర్శిటీలో MBA చేసిన జోషి గతంలో ANZ గ్రైండ్లేస్, ABN AMRO వారి కార్పొరేట్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్లో పనిచేశారు.
రవి కుమార్
అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుంచి బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. ఇన్ఫోసిస్ కు ఇటీవలి కాలంలో రాజీనామా చేసిన కీలక ఉద్యోగుల్లో జోషి ఒకరు. గత సంవత్సరం కంపెనీకి ప్రెసిడెంట్ గా ఉన్న రవి కుమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం రవి కుమార్ కాగ్నిజెంట్ లో సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.