ఆంధ్రప్రదేశ్కు బ్యాడ్ న్యూస్, ఒంటి చేత్తో జగన్ ధ్వంసం: ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్
అమరావతి/బెంగళూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు విషయమై రాష్ట్ర ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం రద్దయింది. ఈ మేరకు రెండు ప్రభుత్వాలు పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టును రద్దు చేసుకున్నాయి. అమరావతి అభివృద్ధికి ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని భావించారు. ఇదే ఉద్దేశ్యంతో గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దీనిని చేపట్టింది. ఈ ప్రాజెక్టు ఒప్పందం రద్దయిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్, మణిపాల్ గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మన్ టీవీ మోహన్దాస్ పాయ్ స్పందించారు.
అమరావతిలో కీలక 'ప్రాజెక్టు' రద్దు, సింగపూర్కు జగన్ ప్రభుత్వం గుడ్బై!! కారణమిదే?
ఏపీకి బ్యాడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతిలో స్టార్టప్ ఇన్ఫ్రా వర్క్ ప్రాజెక్టును రద్దు చేసుకుందని, ఈ ప్రాజెక్టు నుంచి సింగపూర్ కంపెనీలు వెళ్లిపోయాయని, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా బ్యాడ్ న్యూస్ అని మోహన్దాస్ పాయ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇది ఏపీకి దుర్వార్త అని, అలాగే జగన్ చేస్తున్న హరాకిరి (ఆత్మహత్య) అన్నారు.
|
జగన్ ప్రభుత్వం వైఖరి వల్ల ఉపాది దెబ్బతింటుంది
వైయస్ జగన్మోహన్ రెడ్డి పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఒంటి చేత్తో ధ్వంసం చేస్తున్నారని మోహన్దాస్ పాయ్ అన్నారు. జగన్ ప్రభుత్వం వైఖరి వల్ల ఉపాది, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు ఏపీకి ఎందుకు వస్తారని, ఇది చాలా బాధాకరమైన విషయమన్నారు.
గతంలోను...
పీపీపీ ఒప్పందాలు సహా పలు అంశాలపై జగన్ ప్రభుత్వం తీరును కేంద్రం, జపాన్ కూడా తప్పుబట్టాయి. పెట్టుబడిదారులను భయపెట్టేలా చర్యలు ఉండవద్దని హితవు పలికాయి. మోహన్ దాస్ పాయ్ గతంలోను జగన్ ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. దేవాలయాల భూములపై ఆయన స్పందించారు.
ఒప్పందాలపై సమీక్ష.. సరికాదు
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత చంద్రబాబు నాయుడు హయాంలోని పలు ఒప్పందాలు రద్దు చేస్తున్నారు. గత టీడీపీ హయాంలో జరిగిన పీపీపీలను సమీక్షిస్తామని ఏపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పడం చర్చనీయాశంగా మారింది. దీనిపై కేంద్ర ప్రభుత్వంతో సహా ఎంతోమంది తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒప్పందాలు సమీక్షిస్తామంటే పెట్టుబడులపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వాదనతో ఏకీభవిస్తూ..
మోహన్ దాస్ పాయ్ పోస్టుకు పెద్ద ఎత్తున కామెంట్స్ వచ్చాయి. ఎక్కువగా ఆయనకు అనుకూలంగా కామెంట్స్ వచ్చాయి. ఆయన వాదనతో చాలామంది ఏకీభవించారు. మరోవైపు, స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పరస్పర ఒప్పందంతో రద్దయినప్పటికీ సింగపూర్, ఏపీ మంత్రులు భిన్నంగా స్పందించారు. ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు చేసే ఆలోచన లేదని, అందుకే తాము తప్పుకున్నామని సింగపూర్ మంత్రి ఈశ్వరన్ చెప్పగా, ఈ ప్రాజెక్టు వల్ల ఏపీకి ప్రయోజనం ఏమిటో చెప్పాలని తాము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం లేకపోవడంతో రద్దు చేసుకున్నట్లు ఏపీ మంత్రి బొత్స చెప్పారు.