డిజిటల్ టెక్నాలజీ, AI ముఖేష్ అంబానీ ఏం చెప్పారంటే?
భారత ప్రభుత్వం గ్లోబల్ AI సమ్మిట్ - రెస్బాన్సిబుల్ AI ఫర్ సోషల్ ఎంపవర్మెంట్(RAISE 2020)ను ప్రారంభించింది. సోమవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమైన శిఖరాగ్ర సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగాల్లో కృత్రిమ మేధస్సు, టెక్నాలజీని అభివృద్ధి చేయడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశ్యం. ఈ వర్చువల్ కార్యక్రమంలో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మాట్లాడారు.
ఇంటెలిజెంట్ డేటానే డిజిటల్ పెట్టుబడి అని ముఖేష్ అంబానీ అన్నారు. 5జీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినప్పటికీ ఈ రంగంలో భారత్ తన నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆరేళ్ల క్రితం డిజిటల్ ఇండియా మిషన్ను ప్రారంభించారని, దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. దీని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. 99 శాతం కంటే ఎక్కువ మందికి భారత్ 4జీ బ్రాడ్బాండును అందించిందని చెప్పారు. మొబైల్ వినియోగంలో ప్రపంచంలో 155వ స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకున్నామన్నారు. 5జీలో భారత్ తన నాయకత్వ స్థానాన్ని కొనసాగిస్తోందని చెప్పారు.
భారత్నెట్కు థ్యాంక్స్ అని, ఇది ప్రతి ఇల్లు, కార్యాలయాన్ని కనెక్ట్ చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. నగరాలు, పట్టణాలను మాత్రమే కాకుండా ఆరు లక్షల గ్రామాలను కలుపుతూ భారత్ ఇప్పుడు భారీ పాన్ ఇండియా ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ను రూపొందిస్తోందన్నారు. ఇది ఫిక్స్డ్ బ్రాడ్ బాండ్లలో భారత్ను టాప్ దేశాల్లో చేర్చిందన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ మేకిన్ ఇండియాకు చొరవ చూపించారని, ఇది మన దేశంలోనే ఉత్పత్తులను తయారు చేసుకోవడానికి దోహదపడుతోందన్నారు. అవసరమైన అన్ని డిజిటల్ పరికరాలు, సెన్సార్లు సరసమైన ధరల్లో తయారు చేస్తున్నట్లు చెప్పారు. ప్రపంచస్థాయి డేటా సెంటర్లతో కంప్యూట్ పవర్లో భారత్ అగ్రరాజ్యంగా మారుతోందన్నారు. 130 కోట్ల భారతీయులు డిజిటల్ అక్షరాస్యత పొందితే, అది వేగంగా వృద్ధి చెందడంతో పాటు, మెరుగైన జీవన ప్రమాణాలు సృష్టించి, సమాజంలో ఉన్నత అవకాశాలను కల్పిస్తుందన్నారు. దేశంలో AI అభివృద్ధి చేయడం ద్వారా భారతీయులందరికీ సులువుగా టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. AI ద్వారా భారత్ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని ముఖేష్ అంబానీ అన్నారు. ఇంటెలిజెంట్ డేటానే డిజిటల్ పెట్టుబడి అన్నారు.