విలాసాల మోజులో భారతీయులు.. ఆ దేశంలో ఇళ్ల కోసం వేల కోట్లు ఖర్చు.. ఎక్కడో తెలుసా..?
సొంతిల్లు కలిగి ఉండాలని మధ్యతరగతి ప్రజలు కలగంటూ ఉంటారు. కానీ వ్యాపారవేత్తలు, ఉన్నత వర్గాల ఆలోచనలు అందుకు భిన్నంగా ఉంటాయి. స్థలాలు, ఇళ్లు అనేవి విలాసవంతమైన జీవన విధానానికి, పెట్టుబడికి మార్గాలుగా వారు చూస్తుంటారు. అందులోనూ విదేశాల్లో సొంత నివాసం ఉండాలని చూసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ వస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. దుబాయ్ లో ఇళ్లు కొనేందుకు మన భారతీయులు గతేడాది 35 వేల కోట్లకు పైగా వెచ్చించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
అగ్రస్థానం ఇండియాదే:
గతేడాది రియల్ ఎస్టేట్ డ్రెండ్ ను గమనిస్తే.. దుబాయ్ లో భారతీయులు కొనుగోలు చేసిన ఆస్తుల విలువ రూ. 35,500 కోట్లు అని తేలింది. 2021తో పోలిస్తే ఈ కొనుగోళ్లు రెట్టింపు అయ్యాయి. దుబాయ్ లోని మొత్తం గృహ కొనుగోలుదారుల్లో 40 శాతం ఇండియాకు చెందినవారే. అధికంగా 40 శాతం మంది ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, హైదరాబాద్, పంజాబ్ వాసులు కాగా.. UAEలోని భారతీయులు 40 శాతం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండియన్స్ 20 శాతమని గణాంకాలు చెబుతున్నాయి.
మెట్రో నగరాల్లో ఇళ్లను కాదని..
టెక్నాలజీ డ్రివెన్ సౌకర్యాలు అధికంగా ఉన్నందున దుబాయ్ లో ఆస్తుల కొనుగోళ్లపై ప్రపంచవ్యాప్తంగా పలువురు ఎక్కవగా దృష్టి సారిస్తున్నట్లు అక్కడి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ CEO ఒకరు చెప్పారు. మెట్రో నగరాల్లోని ఇళ్లను సైతం కాదని అనేకమంది సంపన్న భారతీయులు ఇక్కడున్న హైఎండ్ అద్దె అపార్ట్మెంట్లలోకి వస్తున్నారన్నారు. కరోనా సమయంలో దుబాయ్ అద్దె మార్కెట్ 30 శాతం క్షీణించగా.. ఇప్పుడు తిరిగి 2015-16 స్థాయికి పుంజుకున్నట్లు వెల్లడించారు.
గ్లోబల్ కనెక్టివిటీ:
"దుబాయ్లో నివసించడం వల్ల నా వ్యాపార అవసరాల కోసం హైదరాబాద్, లండన్, దుబాయ్ మధ్య తేలికగా ప్రయాణించగలుగుతున్నాను. దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ అందిస్తోన్న ఫిన్టెక్ ఎకోసిస్టమ్.. అనేక మంది భారతీయ యువ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తోంది. నా భార్య దుబాయ్ లో తన ఫిన్టెక్ వెంచర్ను ఏర్పాటు చేసింది. తద్వారా గ్లోబల్ మార్కెట్లలో సులభంగా ప్రవేశించడానికి వీలు కలిగింది. ఇండియా నుంచి అంత ప్రభావవంతంగా చేయలేకపోయింది" అని JV వెంచర్స్ సహ వ్యవస్థాపకులు విశాల్ గోయల్ తెలిపారు.
విలాసాలకు కేరాఫ్:
విలాసవంతమైన దేశంగా పేరున్న దుబాయ్ లో ఇళ్లు కొనేందుకు భారతీయ సంపన్నులు ఎగబడుతున్నట్లు అక్కడి రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెబుతున్నారు. డౌన్ టౌన్ దుబాయ్, బుర్జ్ ఖలీఫాతో పాటు పలు షాపింగ్ మాల్స్, ఎత్తైన భవంతులతో నిండిన ఈ పర్యాటక దేశంలో నివాసాలకు ఇండియా నుంచి మంచి డిమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
భారీగా అద్దె రాబడి:
భారతీయులు కొనుగోలు చేసే గృహాలు సగటున రూ.3.6 -3.8 కోట్ల మధ్య ఉంటున్నాయని టాక్. వీటిపై నెలవారీ అద్దెలు సైతం రూ.3-3.5 లక్షల వరకు వసూలు చేస్తున్నారట. ముంబై మాదిరిగానే దుబాయ్లోని ఆస్తుల నుంచి కూడా సగటు అద్దె రాబడి 4 నుంచి 5 శాతం మధ్య ఉంటుందని అక్కడి రియల్టర్లు అభిప్రాయపడుతున్నారు.