Stock Market Crash: కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. రూ.4 లక్షల కోట్లు ఆవిరి.. బ్యాంక్ స్టాక్స్ ఫసక్
Stock Market Crash: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు అనూహ్యంగా నష్టాల్లో కూరుకుపోయాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు అదే ధోరణిని కొనసాగించాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 800 పాయింట్లకు పైగా బలహీనపడింది. నిఫ్టీ కూడా 17900 దిగువన ట్రేడవుతున్నాయి.
అమ్మకాల బలం..
ఈరోజు మార్కెట్లో ప్రధానంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, మెటల్, ఫార్మా రంగాల్లోని షేర్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. ఈ కారణంగా ఇన్వెస్టర్లు దాదాపుగా రూ.4 లక్షల కోట్లు కోల్పోయారు. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ ఆవిరికావటంతో మార్కెట్లు కుప్పకూలాయి. లక్షల కోట్లు పోగొట్టుకున్న ఇన్వెస్టర్లు షాక్ లో ఉన్నారు.
మార్కెట్ల పతనం ఎందుకంటే..?
జనవరిలో F&O గడువు ముగిసే రోజున భారతీయ మార్కెట్లు భారీ క్షీణతను చవిచూస్తున్నాయని స్వస్తిక ఇన్వెస్ట్మార్ట్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా అన్నారు. దీనికి తోడూ యూనియన్ బడ్జెట్ కు ముందు మార్కెట్లలో కొంత గందరగోళం నెలకొందని ఆయన అభిప్రాయపడ్డారు. 2022లో కూడా మార్కెట్లు జనవరి చివరి వారాల్లో క్షీణతను నమోదు చేసినట్లు గుర్తుచేశారు. బడ్జెట్ తర్వాత వచ్చే పదునైన ర్యాలీకి ముందు మార్కెట్ల పతనం ఇన్వెస్టర్లకు కొనుగోలు అవకాశాలను కల్పించవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
క్లోజింగ్ లో సూచీలు..
ఈరోజు మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 773 పాయింట్లు నష్టపోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 206 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 1042 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 430 పాయింట్ల మేర నష్టపోయాయి.
టాప్ గెయినర్స్ అండ్ లూజర్స్..
మార్కెట్ క్లోజింగ్ నాటికి ఎన్ఎస్ఈలో హిందాల్కొ, మారుతీ, బజాజా ఆటో, హిందుస్థాన్ యూనీలివర్, ఓఎన్జీసీ, ఐటీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హీరో మోటోకార్ప్, బ్రిటానియా, ఎన్టీపీసీ, ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉండగా.. అదానీ పోర్ట్స్, ఎస్బీఐఎన్, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్ అండ్ టీ, అదానీ ఎంటర్ ప్రైజెస్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు నష్టాల్లో క్లోజ్ అయ్యాయి.